America: అమెరికాలో భారీ స్కామ్‌.. భారతీయులకు జైలు శిక్ష!

ఔట్‌కమ్‌ హెల్త్‌ పేరిట రిషిషా, శ్రద్ధా అగర్వాల్‌లు ఓ హెల్త్‌ మీడియా సంస్థను 2006లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ డాక్టర్ల వద్ద స్క్రీన్‌లు, టాబ్లెట్లను ఏర్పాటు చేసింది.

Written By: Raj Shekar, Updated On : July 2, 2024 2:11 pm

America

Follow us on

America: అగ్రరాజ్యాం అమెరికాలో భారత సంతతి వ్యాపారులు బిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడ్డారు. నేరం నిర్ధారణ కావడంతో న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. దీంతో వ్యాపారులు కటకటాలు లెక్కిస్తున్నారు. ఒకప్పుడు చికాగోలోనే అత్యంత వేగంగా ఎదిగిన స్టార్టప్‌ మోసాలకు పాల్పడినట్లు న్యాయస్థానం పేర్కొంది.

ఏం జరిగిందంటే..
ఔట్‌కమ్‌ హెల్త్‌ పేరిట రిషిషా, శ్రద్ధా అగర్వాల్‌లు ఓ హెల్త్‌ మీడియా సంస్థను 2006లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ డాక్టర్ల వద్ద స్క్రీన్‌లు, టాబ్లెట్లను ఏర్పాటు చేసింది. వీటిలో పేషెంట్లను లక్ష్యంగా చేసుకుని వివిధ కంపెనీల మెడికల్‌ అడ్వర్టైజింగ్‌ ప్రకటనలు ప్రసారం చేసేంది. ఈ సృజనాత్మకత ఆలోచనకు అమెరికాలో మంచి స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా కంపెనీకి కాంట్రాక్టులు లభించాయి.

2010లో అగ్రస్థానానికి..
క్రమంగా ఈ సంస్థ ఎదుగుతూ 2010 నాటికి అమెరికా టెక్, హెల్త్‌ కేర్‌ ఇన్వెస్ట్‌మెంట్లలో ఉన్నత స్థానానికి చేరింది. దీంతో భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. గోల్డ్‌మన్‌ సాక్స్, అల్ఫాబెట్, జేబీ ప్యాట్రిక్స్‌ వెంచర్‌ క్యాపిట్స్‌ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. చికాగో కార్పొరేట్‌ సర్కిల్స్‌లో షా అప్పట్లో ఓ స్టార్‌ అయ్యాడు.

ఫైనాన్షియల్‌ కార్యకలాపాలు పెంచి..
అయితే రిషి షా, శ్రద్ధా అగర్వాల్‌ సీఎఫ్‌వో బ్రాండ్‌ పౌర్టీలు కంపెనీ ఆపరేషనల్, ఫైనాన్షియల్‌ కార్యకలాపాలు పెంచి చూపించినట్లు గుర్తించారు. కంపెనీ డెలివరీ చేయగలిగిన స్థాయి కన్నా ఎక్కువ వాణిజ్య ప్రకటనల ఇన్వెంటరీని విక్రయిస్తున్నట్లు తేలింది. ఫార్మా జెయింట్‌ నోవో నార్డ్‌స్క్, మరికొన్ని కంపెనీలు ఈ అంశాలను గుర్తిచాయి. మరోవైపు రిషి షా విలాసవంతమైన జీవన శైలి ఇన్వెస్టర్లలో అనుమానాలు పెంచింది. అతను 10 మిలియన్‌ డాలర్లు వెచ్చించి ఇల్లు కొనుగోలు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ 2017లో కథనం ప్రచురించింది.

కోర్టులో కేసు…
తర్వాత గోల్డ్‌మన్‌ సాక్స్, అల్ఫాబెట్‌ వంటి ఇన్వెస్టర్లు కోర్టును ఆశ్రయించారు. షాపై 2023 ఏప్రిల్‌లో డజను కౌంట్స్‌కుపైగా మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది. మిగిలిన ఇద్దరిని కూడా దీనిలో భాగస్వాములను చేశారు. ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం జూన్‌ 26న షాకు ఏడేళ్ల ఆరు నెలల జైలు, శ్రద్ధా అగర్వాల్‌కు జూన్‌ 30 నుంచి మూడేళ్ల హాఫ్‌వే హౌస్‌లో ఉండేలా, పౌర్టీకి రెండేళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది. మరోవైపు తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు రిషి షా తన నేరం అంగీకరించాడు.