HomeNewsరేవంత్ రెడ్డిపై వీహెచ్ వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డిపై వీహెచ్ వ్యాఖ్యలు

పీసీసీ అధ్యక్ష పదవిపై పీటముడి వీడడం లేదు. పదవి ఎవరని వరిస్తుందోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో సీనియర్లకు ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఎలా ఇస్తారని సీనియర్ నాయకుడు హనుమంత రావు మండిపడుతున్నారు. దీంతో పదవిపై ఎవరి అంచనాలు వారికున్నాయి. రేవంత్ రెడ్డి కావాలని కొందరు, సీనియర్లకే ఇవ్వాలని మరికొందరు ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన వారికంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పెత్తనం ఎక్కువైపోయిందని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్టాడుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసి కాంగ్రెస్ లోకి వచ్చారన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు పీసీసీ చీప్ ఇస్తారా? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డిపై అనేక ఆరోపణలున్నాయని, అలాంటి వారికి పదవులు ఎలా కట్టబెడతారని అన్నారు. ఒకవేళ జైలుకు పోతే ఎట్లా అని పేర్కొన్నారు. ఇంతవరకు తనను తిట్టినవారు లేరని, మూడు నాలుగు పార్టీలు తిరిగిన వాళ్లు తిడుతున్నారని ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డిపై ఆరోపణలున్నాయంటే కొందరు బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జానారెడ్డి ఒక్కరే ఖండించారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, విక్రమార్క స్పందించలేదన్నారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టినా తనకు కడప నుంచి బెదిరింపులు రాలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి పెద్ద నాయకుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకకు ఓడిపోయారని ప్రశ్నించారు.జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎంతమందిని గెలిపించారన్నారు. పీసీసీ అధ్యక్షుడివైతే కాంగ్రెస్ ను టీడీపీ చేస్తావా అన్నారు. జూనియర్లు సీనియర్లు కలిసి పనిచేస్తేనే పార్టీ ఎదుగుతుందని చెప్పారు.

పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని కోరారు. లేకుంటే సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని సూచించారు. తనకు సొంత పార్టీలోనే రక్షణలేదని పేర్కొన్నారు. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియదని భయం వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరానన్నారు. రేవంత్ రెడ్డి ఏంకాకముందే తనకు ఇబ్బందిగా ఉందని, పార్టీ ప్రెసిడెంట్ అయితే తన పరిస్థితి ఏమిటని కంగారు పడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనే కోవర్టులు ఉన్నారన్నారు..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version