Israel: తన జోలికి వస్తే ఇజ్రాయిల్ ఎందుకు ఊరుకుంటుంది.. టార్గెట్ ఫినిష్ చేసింది.. హెజ్ బొల్లా చీఫ్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు..

అసలే అది ఇజ్రాయిల్.. డిఫెన్స్ లో అమెరికాకు మించిన సాంకేతికత దాని సొంతం. అలాంటి దేశం పైకి శత్రు దేశాలు దండెత్తి వచ్చాయి. రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాయి. ఇన్నాళ్లపాటు ప్రతిఘటించింది. ఇక లాభం లేదనుకుని తన అసలు రూపం చూపించడం మొదలుపెట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 28, 2024 5:05 pm

Israel(3)

Follow us on

Israel: గత కొద్దిరోజులుగా హెజ్ బొల్లా పై ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. హెజ్ బొల్లా కు స్థావరంగా ఉన్న లెబనాన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. ఇటీవల వాకీ టాకీ లలో బాంబులు పెట్టి హెజ్ బొల్లా కు చుక్కలు చూపించిన ఇజ్రాయిల్.. తాజాగా హెజ్ బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇజ్రాయిల్ జరిపిన దాడిలో నస్రల్లా కుమార్తె జైనబ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మృతిని హెజ్ బొల్లా , లెబనాన్ ఇంతవరకు ధ్రువీకరించలేదు. హెజ్ బొల్లా లో జైనబ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. 1997లో ఇజ్రాయిల్ దళాలు జరిపిన దాడుల్లో జైనబ్ సోదరుడు హదీ దుర్మరణం చెందాడు. అప్పటినుంచి జైనబ్ ఇజ్రాయిల్ పై మరింత కక్ష పెంచుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం చేసిన త్యాగాల గురించి వివరించింది. హెజ్ బొల్లా ఏర్పాటు ఉద్దేశాన్ని వెల్లడించింది. ఇక అప్పటినుంచి ఆమెను ఇజ్రాయిల్ టార్గెట్ గా పెట్టుకుంది. చివరికి ఇన్నాళ్లకు ఆమెను అంతమొందించింది. ఆమె కన్నుమూసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.. జైనబ్ మృతికి హెజ్ బొల్లా గ్రూప్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని, దాడులు తీవ్రతరం చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

హెజ్ బొల్లా చీఫ్ టార్గెట్ గా..

హెజ్ బొల్లా చీఫ్ నస్రన్ ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది దక్షిణ లెబనాన్ దాహియా లోని ఓ భూగర్భంలోహెజ్ బొల్లా ప్రధాన కార్యాలయం ఉంది. దానిపై ఇజ్రాయిల్ విధ్వంసకరమైన బాంబులను వేసింది. అయితే ఈ దాడుల్లో నస్రల్లా కు ఏమైనా జరిగిందా? అతడు మరణించాడా? సురక్షితంగా ఉన్నాడా? అనే విషయాలపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. మరోవైపు ఇజ్రాయిల్ కూడా అతడు మరణించాడు అని చెప్పడం లేదు. అయితే తాము ప్రయోగించిన బాంబు వల్ల అతడు బతికే అవకాశం లేదని ఇజ్రాయిల్ చెబుతోంది. హెజ్ బొల్లా వర్గాలు మాత్రం నస్రల్లా బ్రహ్మాండంగా ఉన్నాడని చెబుతున్నాయి. కాకపోతే అతడితో కమ్యూనికేషన్ లేదని అంటున్నాయి. బీరూట్ లో దాడులు చేసిన నేపథ్యంలో హెజ్ బొల్లా ప్రతీకారం మొదలుపెట్టింది. ఇజ్రాయిల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకొని 65 రాకెట్లతో దాడులు చేసింది. మరో వైపు ఇజ్రాయిల్ హెజ్ బొల్లా తవరాలను లక్ష్యంగా చేసుకుంది. క్షిపణులతో దాడులు చేస్తోంది. ఫలితంగా బీరూట్, లెబనాన్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.