ఇంటి గుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్లు జగన్ గుట్టంతా ఆయన తల్లి, చెల్లలుకే తెలుసు. ఇడుపులపాయ వద్ద కనిపించిన సన్నివేశంతో జగన్ కుటుంబంలో కూడా లుకలుకలు మొదలైనట్లు సమాచారం. అసలు షర్మిల తెలంగాణల పార్టీ పెట్టడమే జగన్ కు ఇష్టం లేనట్లు గతంలోనే చెప్పారు. కానీ ఆమె అన్న మాట వినలేదు. తాను పార్టీ పెట్టడానికే నిర్ణయించుకున్నానని చెప్పి అనుకున్నట్లుగానే వైఎస్సార్ టీపీ ని స్థాపించి పోరాటం మొదలుపెట్టారు.
వైఎస్ సంస్మరణ సభకు కూడా జగన్ వ్యతిరేకులే ఎక్కువగా హాజరయ్యారు. వారంతా రాజన్న రాజ్యం కోసం పాటుపడతామని చెప్పారు. వైఎస్ పై ఉన్న అభిమానంతోనే వారు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ కు తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల మధ్య పొసగడం లేదని పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో బహిరంగంగా విమర్శలు చేయకపోయినా లోపల మాత్రం వారు మాట్లాడుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా వారు ఇక కలుసుకోవడం ఉండదనే సమాచారం.
వీరి పద్ధతులపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ ఇంటిని చక్కదిద్దుకోని జగన్ ఏపీని ఏం సరిచేస్తారని ఎద్దేవా చేస్తున్నారు. కూట్ల్లో రాయి ఏరలేని వాడు ఏట్లో ఏం ఏరతాడని ప్రశ్నిస్తున్నారు. విజయమ్మ, షర్మిల జగన్ ను దూరం పెట్టి వారి దారి వారు చూసుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. గతంలో జగన్ ను గెలిపించిన మహిళలే ఇప్పుడు తిడుతున్నారని చెబుతున్నారు. జగన్ ఏదో చేస్తాడు అనుకుంటే ఏమి చేయకపోవడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఏపీలో పరిస్థితులు చూస్తుంటే జగన్ కు గడ్డు స్థితి వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ఇంటి వాళ్లను కూడా కరివేపాకులా తీసేశారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. విజయమ్మ, షర్మిల ఉద్దేశాలను జగన్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే వారు తమ దారి తాము చూసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.