
మాజీ ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ డిసెంబరు 25న రైతులను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని రైతులకు స్పష్టం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథక నిధులు రూ. 18వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు ప్రభుత్వ పథకాల ద్వారా వారు పొందిన లాభాల గురించి మాట్లాడతారని ఆ ప్రకటనలో వెల్లడించారు. వర్చువల్ విధానంలో జరగనున్న ఈ కార్యక్రమంలో సుమారు 9 కోట్ల మంది రైతులు పాల్గొననున్నట్లు తెలిపారు.