నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్రం ప్రభుత్వం మరోసారి భేటీ అయ్యింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నేతృత్వంలో రైతు సంఘాల ప్రతినిధులతో ఈ చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు రైతుల ఆందోళనపై ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో కీలక భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. రైతుల డిమాండ్ల పరిష్కారంపై కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, తోమర్, పీయూష్ గోయల్తో మోదీ సుదీర్ఘంగా చర్చించారు. అన్నదాతల ప్రతిపాదనల మేరకు వ్యవసాయ చట్టాల్లో కొన్ని సవరణలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే చట్టాలను పూర్తిగా వెనక్కితీసుకోవాల్సిందేనని, సవరణలకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని రైతులు చెబుతున్నారు.