Republic Day 2024: గణతంత్ర థీమ్ సూపర్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫిదా

గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాష్ట్రపతి అవార్డులు, వీర సైనికులకు పరమవీరచక్ర, అశోక చక్ర పురస్కారాలు అందించారు. ఇక రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ సందర్భంగా తమ సందేశాన్ని ప్రకటించారు. గణతంత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 26, 2024 12:00 pm
Follow us on

Republic Day 2024: దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు అంబరాన్ని అంటాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మక్రాన్ హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమ్మానుయేల్ మక్రాన్ ను తోడుకొని ఎర్రకోట వద్దకు తీసుకొచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి ప్రదర్శనలు తిలకించారు.. సైనిక దళాలు పరేడ్ నిర్వహిస్తుండగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మురిసిపోయారు. శకటాల ప్రదర్శన చూసి అబ్బురపడ్డారు. 75 వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.. రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం మాత్రమే కాదు. ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనం. ఇది ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ స్ఫూర్తి భారతీయుల్లో నిండి ఉంటుందని అంబేద్కర్ రాసిన వ్యాఖ్యలను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఉటంకించారు. అంతేకాదు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ థీమ్ వీక్షిత్ భారత్ ను ఆయన కొనియాడారు. ఇది లోకతంత్రకి మాతృక అని.. ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారత పాత్రను నొక్కి చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన గణతంత్ర వేడుకలు దాదాపు 90 నిమిషాల పాటు సాగాయి. సందర్భంగా సైనికులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల శకటాలు అబ్బురపరిచాయి.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాష్ట్రపతి అవార్డులు, వీర సైనికులకు పరమవీరచక్ర, అశోక చక్ర పురస్కారాలు అందించారు. ఇక రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ సందర్భంగా తమ సందేశాన్ని ప్రకటించారు. గణతంత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించారు. భారతదేశ రాజ్యాంగానికి 1950 జనవరి 26న ఆమోదం లభించిందని పేర్కొన్నారు. 1947లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం లభించినప్పటికీ.. 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ఆమె వివరించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతే భారత్ ఒక సార్వభౌమ అధికారం కలిగిన గణతంత్ర దేశంగా గుర్తింపు పొందిందని ప్రకటించారు. అమృతకాలంలో దేశం అభివృద్ధి వైపు సాగుతోందని ఆమె ప్రకటించారు. అంతేకాదు ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకొని ప్రాణ ప్రతిష్ట జరుపుకున్న అయోధ్య రామాలయ వృత్తాంతాన్ని కూడా ఆమె వివరించారు.

గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల నగరాల్లో జరిగాయి. ఇందులో మెరుగైన ప్రదర్శనలను గణతంత్ర దినోత్సవానికి అధికారులు ఎంపిక చేశారు. వారు ఫ్రాన్స్ అధ్యక్షుడి ఎదుట తమ ప్రదర్శనలను ప్రదర్శించారు. గణతంత్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని ఢిల్లీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దేశ రాజధాని నగరాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. అణువణువు క్షుణ్ణంగా పరిశీలించాయి. అనుమతించిన వారిని మాత్రమే ఎర్రకోటలోకి పంపించాయి. గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన పరేడ్ లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పతనాన్ని వివరిస్తూ రూపొందించిన శకటం ఆకట్టుకుంది. అంతేకాదు శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను స్వీకరించాలని ఈ శకటం తేల్చి చెప్పినట్టయింది.