టీడీపీ అధినేత చంద్రబాబు తన 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎన్నో కేసుల్లో ఇరుకున్నా.. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటూ కేసులు విచారణ జరగకుండా చాకచక్యంగా తప్పించుకుంటాడని రాజకీయవర్గాల్లో ఓ టాక్ ఉంది. అందుకే చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయంలో ఒక్క విచారణను కూడా ఎదుర్కోలేదంటారు. చంద్రబాబు మేనేజ్ చేసినట్టు వ్యవస్థలను ఎవరూ మేనేజ్ చేయలేరనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది.
అది మరోసారి నిరూపితమైంది. ఏపీలో జగన్ సర్కార్ ఎంత శ్రమకోర్చి.. పక్కా ప్లాన్ వేసి వెతికి తీసి మరీ అమరావతి దళితుల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన కేసులో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది.
అయితే చంద్రబాబు పకడ్బందీగా దిగ్గజ లాయర్లను దించేసి ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు. వాద ప్రతివాదనల్లో చంద్రబాబు వాదనే నెగ్గింది. దీంతో ఏపీ సీఐడీ కేసులో స్టే లభించింది. అయితే చంద్రబాబును మాత్రం ‘వదల బొమ్మాళి’ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
అమరావతి అసైన్డ్ భూముల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ సీఐడీ తాజాగా డిసైడ్ అయ్యింది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడంతో దీనిపై సీఐడీ సుప్రీంకు వెళ్లనుంది. హైకోర్టు స్టే ఆర్డర్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది.
ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ హైకోర్టులో వాదనతో స్టే తెచ్చుకున్న చంద్రబాబు సుప్రీంకోర్టులోనూ విజయం సాధిస్తాడా? లేక జగన్ సర్కార్ పంతం నెగ్గుతుందా? అన్నది ఆసక్తిగా మారింది.