తిరుపతి లోక్సభ స్థానాన్ని అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో సీటును కాపాడుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటివరకు లోకల్ బాడీస్, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీ.. అదే ఊపుతో తిరుపతి ఎన్నికల్లోనూ హవా చూపించాలని దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు.. తమ పార్టీ అభ్యర్థికి ఇక్కడ భారీ మెజార్టీ తీసుకొచ్చి దేశం మొత్తం తిరుపతి వైపు తిరిగి చూసేలా గెలుపు ఉండాలని సూచించారు.
ఇందుకోసం.. ఏడు నియోజకవర్గాలకు ఏడుగురు మంత్రులను ఇన్చార్జీలుగా పెట్టారు. ఆ ఏడుగురుకి తోడుగా ఏడుగురు ఎమ్మెల్యేలను కేటాయించారు. దిశానిర్దేశం చేసి తిరుపతికి పంపించారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో వైసీపీకి తిరుగులేని బలం ఉంది. ఏడుగురు ఎమ్మెల్యేలతోపాటు పంచాయతీలు, మున్సిపాలిటీలు అన్నీ ఆ పార్టీ చేతుల్లోనే ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గడప గడపనూ సందర్శించాలని జగన్ దిశానిర్దేశం చేశారు.
వైసీపీ తరఫున జగన్ ప్రచారం చేసే అవకాశం లేదని చెబుతున్నారు. టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ నెల 24వ తేదీన పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 25 వేల మందికి ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి అక్కడ పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్వయంగా చంద్రబాబు కూడా ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఐదుగురితో కూడిని కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ మొదట్లో హడావుడి చేసినా ఇప్పుడు సైలెంట్ అయింది. అందుకే.. అభ్యర్థిని ఖరారు చేయడానికి ఆలోచిస్తోంది.
మొత్తంగా ఈ ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అయినప్పటికీ జగన్ భారీ మెజార్టీ సాధన దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ క్యాండిడేట్ వేటలో పడింది. ఇక జనసేన బరిలో నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ నాయకులు బీజేపీకి సంపూర్ణంగా మద్దతు పలుకుతారా లేదా అన్నది ప్రశ్నగా మారింది. ఎట్టకేలకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఇప్పుడు తిరుపతిలో ప్రచారం మరింత హీటెక్కించనున్నాయి. ఫైనల్గా గెలుపు ఎవరిని వరిస్తుందో.. మెజార్టీ ఏ స్థాయిలో వస్తుందో చూడాలి మరి..!