పీసీసీని అధిష్టానం ఇంకా తేల్చక ముందే కాంగ్రెస్ లోని కొందరు నేతలు ముందస్తు ప్రకటనలతో కాక రేపుతున్నాయి. పీసీసీ పదవీపై ఆశలు పెట్టుకున్న నేతలను వీలైనంత వరకు అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది.
పీసీసీ చీఫ్ ప్రకటనకు ముందే కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాల్లేకుండా అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడి బీజేపీ బలపడటంతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. మాజీ ఎంపీ వీహెచ్ హన్మంతరావులు ఇటీవల పీసీసీ ఎంపిక పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీహెచ్ అయితే ఏకంగా అధిష్టానం చేపట్టిన అభిప్రాయ సేకరణను తప్పుబట్టాడు.
పీసీసీ చీఫ్ నియామకాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం మాత్రం మరోసారి సీనియర్లతో సంప్రదింపులు చేస్తోంది. అధిష్టానం తరపున ఠాగూర్.. కేసీ వేణుగోపాల్ లు సంప్రదింపులు జరుపుతున్నారు.
కోర్ కమిటీలోని ముఖ్యులతో పీసీసీ నియామకంపై చర్చిస్తున్నారు. రెండ్రోజులుగా కొందరు సీనియర్లతో ఠాగూర్.. వేణుగోపాల్ లు చర్చించారు.
రాహుల్ గాంధీ సైతం ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ అభిప్రాయాన్ని కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. రేపు సాయంత్రంలోగా సంప్రదింపులను ముగించాలని అధిష్టానం భావిస్తోంది.
దీంతోపాటు ఇటీవల వీహెచ్ చేసిన కామెంట్స్ పై కూడా ఏఐసీసీ ఆరా తీసినట్లు సమాచారం. కొత్త సంవత్సరం పీసీసీ చీఫ్ ప్రకటన రానుండటంతో కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం ఆసక్తి నెలకొంది.