Tuni Jnaneswari missing case : తుని ప్రాంతంలో సరిగా ఎనిమిది రోజుల క్రితం మిస్ అయిన జ్ఞానేశ్వరి కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఆ పాప ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ కేసులో అత్యంత కీలకమైన కుక్క శనివారం ఎవరూ ఊహించని విధంగా మృతి చెందింది. దీంతో ఈ కేసు మరింత జటిలంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసు పై పోలీసులకు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక బృందాలను నియమించారు. అందరూ సమన్వయం చేసుకొని పాప ఆచూకీ అని పెట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఆ 15 నిమిషాలే..
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈనెల 6న పాప మిస్సయింది. ఉదయం 11 గంటల యాభై నిమిషాలకు పాపను భార్యకు ఇచ్చి భర్త పొలానికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో వేరే పాప వారి ఇంటికి వచ్చింది. ఆ పాపను చూస్తూ జ్ఞానేశ్వరిని ఆమె పట్టించుకోలేదు. తల్లి పట్టించుకోకపోవడంతో జ్ఞానేశ్వరి బయటికి వచ్చింది. తండ్రి ఏ దారిలో అయితే వెళ్లాడో.. తను కూడా అదేదారిలో వెళ్లడం మొదలుపెట్టింది.. పాప వెళుతూ ఉంటే ఒక వ్యక్తి ఆమెను గమనించి.. ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. అయితే కుక్క గట్టిగా అరవడంతో అతడు వెళ్లిపోయాడు.
మధ్యాహ్న 12 గంటల నుంచి 12:15 నిమిషాల మధ్యలో పాప మిస్ అయినట్టు తెలుస్తోంది. ఆ 15 నిమిషాల్లోనే పాప దారి తప్పింది. తండ్రి వెళ్లిన దారిలో ప్రయాణం సాగిస్తే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పాప ఉండాలి. కానీ పాప అక్కడ లేదు. పైగా పాప ఇప్పటికే కనిపించక 8 రోజులు అవుతుంది.. ఈ కేసులో అత్యంత కీలకమైన కుక్క కూడా చనిపోయింది. కుక్క కూడా సమీప ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ వెంటనే వచ్చింది. కుక్క మెడకు జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ కేసులో ఎటువంటి పురోగతి లభించలేదు.. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి ఎటువైపు వెళ్ళింది.. ఎక్కడికి వెళ్ళింది.. ఇన్ని రోజులపాటు ఆకలిదప్పులను ఎలా తట్టుకుంటున్నదని.. స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పోలీస్ అధికారులు.. అటవీ శాఖ అధికారులు ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నాలను తీవ్రతరం చేశారు.
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పాప ఇంటి దగ్గర నుంచి.. తన తండ్రి వెళ్లిన మార్గంలోనే పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆ ప్రాంతాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.. ఒకవేళ పాప ఇతర ప్రాంతాలకు వెళ్ళిందేమోనని.. సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. కాగా.. పాపను ఎత్తుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అనేక పర్యాయాలు ప్రశ్నించారు.. ఆ పాప తల్లిదండ్రులకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

