India vs Ireland : టి20 లలో టీమ్ ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది.. అంతేకాదు టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. అటువంటి టీమ్ ఇండియా అత్యంత అనామకమైన ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. 2024 తర్వాత టీమిండియా సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. ఐర్లాండ్ జట్టుతో రెండు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడిన టీమ్ ఇండియా.. రెండు మ్యాచ్లు కూడా ఓడిపోవడం విశేషం. జట్టులో భీకరమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలు కావడానికి సగటు భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
టీమిండియా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యం.. తొలి మ్యాచ్లో సంజు శాంసన్ నిరాశపరిచాడు. కెప్టెన్ అయ్యర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ఇలా టాప్ ఆర్డర్ బ్యాటర్లు మొత్తం అవుట్ అయ్యారు. అత్యంత దారుణమైన ఆట తీరు కొనసాగించి టీమిండియా పరువు మొత్తం పోగొట్టారు. ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో.. అసలు టీమిండియా ఎందుకు ఆడుతోందనే ప్రశ్న సగటు అభిమానిలో వ్యక్తం అయింది.
రెండో మ్యాచ్లో కూడా టీమిండియా ఓపెనర్లు ఇద్దరు సున్నా పరులకు అవుట్ కావడం అత్యంత నిరాశపరిచింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ దారుణమైన ఆట తీరుకొనసాగించారు. ఫలితంగా టీమిండియా ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కిషన్ రన్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ అయ్యర్ కూడా మరోసారి నిరాశపరిచాడు. ఈ దశలో అక్షర్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. తిలక్ వర్మ ఆఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అనవసరమైన షార్ట్ ఆడి.. అవుట్ అయ్యాడు. శివం దుబే కూడా ఔట్ కావడంతో టీమ్ ఇండియా ఓటమి లాంచనమైంది. చివర్లో హర్షిత్ రానా సత్తా చూపించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక పరుగు తేడాతో టీమిండియా ఓటమిపాలైంది.
టీమిండియా ఇలా ఓడిపోవడానికి ప్రధాన కారణం జై ముండ్రా. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమే కాదు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ముండ్రా తొలి మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో మ్యాచ్ లో కూడా అదే స్థాయిలో సత్తా చూపించాడు. ఓపెనర్లు.. కెప్టెన్ అయ్యర్ వికెట్లను తన ఖాతాలో వేసుకొని.. టీమ్ ఇండియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఫలితంగా టీమిండియా ఇతడి ధాటికి తట్టుకోలేకపోయింది. జై ముండ్రా భారతదేశానికి చెందినవాడు. ఇతడిది రాజస్థాన్ రాష్ట్రం.. కొంతకాలంగా ఐర్లాండ్లో క్రికెట్ ఆడుతున్నాడు. గత ఏడాది ఐర్లాండ్ జాతీయ జట్టులో అడుగు పెట్టాడు. అయితే ఇప్పటికీ అతడు ఇండియన్ పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.
