Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం ఉన్నారు. ఆ గ్రామాన్ని మొత్తం చూసి భావోద్వేగానికి గురయ్యారు. పూరిగుడిసెలు ఉన్న గ్రామంలో పక్కా గృహాలు నిర్మిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. ఈ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కెసిఆర్ చెప్పినట్టుగా ఆ గ్రామం రూపురేఖలు మారిపోలేదు. పేదలకు పక్కా గృహాల నిర్మాణం సాధ్యం కాలేదు. కెసిఆర్ మాట నమ్మి ఉన్న ఇండ్లను కూల్చుకున్నారు. నాడు కెసిఆర్ 100 కోట్లు ఇస్తామంటే అక్కడి ప్రజలు పూర్తిగా నమ్మారు. పైగా కేసీఆర్ తమతో పాటు కలిసి భోజనం చేస్తే గ్రామస్తులు మురిసిపోయారు.
నాడు వాసాల మర్రి ప్రాంతంలో కేసీఆర్ కాన్వాయ్ రావడానికి నిర్మించిన తాత్కాలిక రోడ్డు తప్ప.. చెప్పుకునే స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు కాలేదు. భవనాలు నిర్మించలేదు. సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కెసిఆర్ చేసిన చారిత్రక తప్పును దిద్దడం మొదలుపెట్టారు. వాసాల మర్రి ప్రాంతంలో పేదలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ గ్రామానికి ఏకంగా 143 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. ఫలితంగా గ్రామస్తులు యుద్ధ ప్రాతిపదికన ఇండ్లను నిర్మించుకుంటున్నారు. లబ్ధిదారులకు నగదు సాయాన్ని వేగంగా అందించడం మొదలుపెట్టారు.
నాడు కెసిఆర్ వాసాల మర్రి ప్రాంతంలో చేసిన ప్రకటనలను
.. ఇచ్చిన హామీలను పదేపదే ప్రజలకు గుర్తుచేయాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే త్వరలో ఆయన వాసాల మర్రి ప్రాంతంలో పర్యటించబోతున్నారు.. పూర్తిచేసిన పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్తు కాలంలో చేపట్టబోయే పనులను ప్రారంభించబోతున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. కాగా గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా సాగిపోయాయి. రోడ్లు.. ఇతర మౌలిక వసతులను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. ఫలితంగా వాసాలమర్రి బంగారు మర్రిగా రూపుదిద్దుకుంటున్నది.
ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రచారం కోసం గ్రామాలను దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి రేవంత్ వాసాల మర్రి ప్రాంతంలో పర్యటించబోతున్నారు. నాడు కెసిఆర్ కోరుకున్న ప్రచారాన్ని.. ఈ విధంగా దెబ్బ కొట్టబోతున్నారు రేవంత్. మరి దీనిని గులాబీ బాస్ కేసీఆర్ తిప్పి కొడతారో చూడాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో వాసాలమర్రిలో జరుగుతున్నపనులను జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.


