IPL 2026 playoffs : ఐపీఎల్ లో ఇప్పటివరకు ఒక లెక్క.. ఇక ముందు నుంచి ఒక లెక్క. మంగళవారం నుంచి క్వాలిఫైయర్ రేసు మొదలవుతుంది. క్వాలిఫైయర్ రేసులో భాగంగా మంగళవారం ధర్మశాలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ వెళ్తుంది. ఇక బుధవారం ముల్లాన్ పూర్ వేదికగా హైదరాబాద్, రాజస్థాన్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదే వేదిక శుక్రవారం క్వాలిఫైయర్ -2 మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫైయర్ -1 లో ఓటమిపాలైన జట్టు ఎలిమినేటర్ విభాగంలో గెలిచిన జట్లు పోరాడుతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ వెళ్తుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్రమోడి స్టేడియంలో జరుగుతుంది. ఇందులో విజయం సాధించిన జట్టు ట్రోఫీ అందుకుంటుంది.
ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 70 మ్యాచ్ లు జరిగాయి. ఇవన్నీ కూడా అభిమానులకు అద్భుతమైన క్రికెట్ ఆనందాన్ని పంచాయి. ఇప్పటివరకు జరిగిన 70 మ్యాచులు ఒక విధంగా ఉంటే.. ఇకపై జరిగే నాలుగు మ్యాచ్లు మరో విధంగా ఉంటాయి. ప్రేక్షకుల దృష్టి నుంచి చూస్తే ఈ మ్యాచ్ లు సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం లేకపోలేదు. అయితే ఈ నాలుగు మ్యాచ్ల్లో ఏడుగురు ఆటగాళ్లు అద్భుతంగా అదరగొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి ఆట చూసేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఆరెంజ్ క్యాప్ విభాగంలో
సాయి సుదర్శన్
ఆరెంజ్ క్యాప్ విభాగంలో గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ 638 పరులతో టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బెంగళూరు తో జరిగే మ్యాచ్లో ఇతడు గనుక సత్తా చూపిస్తే గుజరాత్ జట్టుకు అడ్డు ఉండదు.. పైగా ఇతడు ఓపెనర్ గా వచ్చి పాతుకు పోతున్నాడు. ఇతడిని అవుట్ చేయడం ఒక రకంగా బెంగళూరు జట్టుకు ఇబ్బందికరమే అని చెప్పాలి.
గిల్
గుజరాత్ జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు గిల్. ఓపెనర్ గా వస్తున్న ఇతడు అద్భుతంగా ఆడుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ విభాగంలో ఇతడు రెండవ స్థానంలో ఉన్నాడు. ఇతడు ఏకంగా 616 పరుగులు చేశాడు. తదుపరి మ్యాచ్లో అదే స్థాయిలో ఆడితే మాత్రం గుజరాత్ జట్టు కు అడ్డు అనేది ఉండదు.
క్లాసెన్
హైదరాబాద్ జట్టు తరఫున కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్న ఆటగాడిగా క్లాసెన్ కొనసాగుతున్నాడు. ఇతడు ఇప్పటివరకు 606 పరుగులు చేశాడు. స్థిరమైన బ్యాటింగ్ చేస్తూ.. జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఇతడి మీద హైదరాబాద్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇతడు గనక మరోసారి తన బ్యాట్ కు అని చెప్తే హైదరాబాద్ జట్టుకు పని ఈజీ అయిపోతుంది.
వైభవ్ సూర్య వంశీ
రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న ఈ 15 సంవత్సరాల బాలుడు ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు ఇతడు 583 పరుగులు చేశాడు. తుఫాన్ వేగంతో బ్యాటింగ్ చేస్తున్న ఇతడు.. హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్లో తిరుగులేని ఇన్నింగ్స్ ఆడతాడని రాజస్థాన్ జట్టు భావిస్తోంది. ఒకవేళ గనుక అతడు మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తే రాజస్థాన్ జట్టుకు విజయం నల్లేరు మీద నడకవుతుంది.

పర్పుల్ విభాగంలో
భువనేశ్వర్ కుమార్
బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న ఇతడు ఇప్పటివరకు 24 వికెట్లు పడగొట్టాడు. తక్కువ పరుగులు ఇచ్చి.. స్వింగ్ బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తున్నాడు. ఇతడి మీద బెంగళూరు భారీ అంచనాలు పెట్టుకుంది. ప్లే ఆఫ్ లో ఇతడు గనుక మరొకసారి తన బౌలింగ్ తో ఆకట్టుకుంటే బెంగళూరు జట్టుకు విజయాలు సులభమవుతాయి. అంతేకాదు ట్రోఫీ గెలిచినా సరే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
రబాడ
గుజరాత్ జట్టు తరఫున ఆడుతున్న ఇతడు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నాడు. లైన్ అండ్ లెంగ్త్ ఏమాత్రం మిస్ చేయకుండా బంతులు వేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. ఇప్పటివరకు అతడు తన ఖాతాలో 24 వికెట్లను వేసుకున్నాడు. తదుపరి మ్యాచ్లో కూడా అతడు అదే జోరు చూపిస్తే గుజరాత్ జట్టు కచ్చితంగా అంచనాలకు అందని ఫలితాన్ని అందుకుంటుంది.
జోప్రా ఆర్చర్
రాజస్థాన్ జట్టుకు ప్రధాన ఆయుధంగా మారాడు ఇతడు. అద్భుతమైన బంతులు వేస్తూ వికెట్లను పడగొడుతున్నాడు. పైగా ఎకనామి విషయంలో కూడా అత్యంత పొదుపు పాటిస్తున్నాడు. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ విజయానికి ఇతడే ముఖ్యకారకుడు. అటువంటి ప్రదర్శనలు ఇతడు మరోసారి రిపీట్ చేస్తే రాజస్థాన్ జట్టు పంట పండినట్టే.
రషీద్ ఖాన్
పర్పుల్ విభాగంలో పేస్ బౌలర్లు వికెట్ల పంట పండించుకుంటే.. రషీద్ ఖాన్ గుజరాత్ తరఫున స్పిన్ బౌలింగ్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు అతడు 19 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ సాధించిన విజయాలలో ముఖ్య పాత్ర పోషించాడు. తదుపరి మ్యాచ్లో కూడా అతడు అదే స్థాయిలో బౌలింగ్ వేస్తే గుజరాత్ జట్టు కచ్చితంగా మరోసారి విజేతగా ఆవిర్భవిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
