Gold Found Land: అది ఆరు ఎకరాల భూమి.. రోడ్డు పక్కనే ఉంటుంది.. నీటి సౌకర్యం పర్వాలేదు. అది పూర్తిగా మెట్ట. పత్తి లేదా మొక్కజొన్న మాత్రమే సాగవుతుంది. కాస్త కష్టపడితే పసుపు పండించవచ్చు. ఇంకా ఎక్కువ కష్టపడితే మిరప కూడా సాగు చేయవచ్చు. కాలం అనుకూలిస్తే.. చీడపీడలు దాడి చేయకుంటే.. కూలీలు సకాలంలో దొరికితే.. మద్దతు ధర బాగుంటే ఎంతో కొంత రైతుకు గిట్టుబాటు అవుతుంది.
పైగా నేటి కాలంలో పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఉన్నవారు భూములను కౌలుకు ఇస్తున్నారు. కౌలుకు తీసుకున్న వాళ్లు.. పెట్టుబడి ఖర్చులు భరించలేక ఎక్కువ కాలం వ్యవసాయం చేయలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆరు ఎకరాల భూమి కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. కౌలుకు తీసుకోవడానికి చాలామంది రైతులు పోటీ పడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం మీడియాకు ఎక్కింది. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో ఒక రైతుకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని కౌలుకు తీసుకోవడానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఇలా పోటీ పడటం వెనుక బంగారం లాంటి కారణం ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన ఒక రైతు నుంచి 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని ఏరియా తండాకు చెందిన ఒక రైతు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈనెల 24న ఆ భూమిలో కలుపు సేకరిస్తుండగా మహిళా కూలీలకు బంగారం లభించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భూమి యజమాని ఆ కూలీలను విచారించి.. అసలు విషయం తెలుసుకున్నారు. బంగారం ఆభరణాలు కూలీలు చూపించగా.. ఆ భూ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ భూమిలో గతంలో ఆలయాలు ఉండేవి. 1991లో అప్పట్లో ఈ భూమి యజమానికి కొంత బంగారం కూడా దొరికింది.. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇదే పొలంలో ఒక వ్యక్తికి బంగారం దొరికింది. అంతేకాదు గతంలో ఈ ప్రాంతంలో దేవత విగ్రహాలు లభించాయి. నాడు బంగారం దొరికిన వ్యక్తులు.. మళ్లీ ఈ భూమి వైపు రాలేదు. ఆ బంగారం దొరికిన వారు ఆర్థికంగా స్థిరత్వం కూడా సాధించారు. మరోవైపు ఇటీవల దొరికిన బంగారాన్ని పంచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. దానిని తమకు అందించాలని ముందుగా భూమి విక్రయించిన వ్యక్తి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ భూమిలో బంగారం దొరికినట్టు వార్తలు రావడంతో చాలామంది రాత్రిపూట ఇక్కడ సంచరిస్తున్నారు. బంగారం కోసం అన్వేషిస్తున్నారు.
