spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP vs Janasena : ఆ పత్రిక దాచిపెడితే.. అసలు విషయం దాగుతుందా?

YCP vs Janasena : ఆ పత్రిక దాచిపెడితే.. అసలు విషయం దాగుతుందా?

YCP vs Janasena : పత్రికా యాజమాన్యాలు న్యూట్రల్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అంతేతప్ప ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వార్తలు వండి వారిస్తే.. నిజాలకు బదులు అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి. చిత్తూరు నియోజకవర్గం లోని అధికార పార్టీ ఎమ్మెల్యే జనసేనలో అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన నేపథ్యంలో ఓ ప్రధాన పత్రిక రాసిన రాతలు ఇలాగే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి..

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో హైదరాబాదు లో భేటీ అయ్యారు. సుదీర్ఘ చర్చల తర్వాత త్వరలో జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఎన్నికల ముందు అటువాళ్లు ఇటు, ఇటు వాళ్ళు అటు చేరడం సర్వసాధారణం. టికెట్ దక్కుతుంది అనుకుంటే అదే పార్టీలో కొనసాగుతారు. టికెట్ ఇవ్వరనే సంకేతాలు ఉంటే వేరే పార్టీలోకి జంప్ అవుతారు. ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారం లేకుండా ఉండలేరు కాబట్టి. ఇక శ్రీనివాసులు విషయానికొస్తే జనసేనలో కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు విషయాన్ని ఓ ప్రధాన పత్రిక తెలివిగా తప్పుదోవ పట్టించిందని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు.

“చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సీటు తమదే అని కాపు సామాజిక వర్గానికి చెందినవారు భావిస్తారు. గత రెండుసార్లు చూసుకుంటే 2014లో డీకే సత్యప్రభ, 2019లో ఏఎస్ మనోహర్ కు టిడిపి టికెట్ ఇచ్చింది. వీళ్ళిద్దరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. త్వరలో జరిగే ఎన్నికల్లో టిడిపి గురజాల జగన్మోహన్ రావుకు టికెట్ ఇచ్చింది. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. తమకు కాదని బాబు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కాపు సామాజిక వర్గానికి చెందినవారు చిత్తూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ విషయాలను ఆ ప్రధాన పత్రిక రాయలేదు. ఆ సమాచారం మొత్తం దాచిపెట్టి, లోకానికి వాస్తవం తెలియకుండా జాగ్రత్త పడింది. కాపుకు గండి కొట్టి సొంత సామాజిక వర్గం వారికి దోచిపెట్టి అనే శీర్షికతో వార్తలు రాసిందని” వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు.

కాగా శ్రీనివాసులు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో ఈయన వైసిపి, టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ఇటీవల సర్వేల్లో ఆయన వెనుకబడి ఉండటంతో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి.. విజయానందా రెడ్డికి టికెట్ కేటాయించారు. విజయానందా రెడ్డి పై అనేక కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. “ఆయనపై కేసులున్నాయి. వేరే వాళ్లకు టికెట్ ఇవ్వాలని కోరినా వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదు. పైగా నాకు రాజ్యసభ స్థానం ఇస్తానని ప్రకటించారు. తీరా అది కూడా ఇవ్వకుండా కడప జిల్లాకు చెందిన మేడా రఘునాథ్ రెడ్డికి కేటాయించారు. దీంతో నాకు పార్టీ మీద గౌరవం పోయిందని” శ్రీనివాసులు అంటున్నారు. అయితే త్వరలో ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version