YCP Kapu Leaders- Pawan Kalyan: పవన్ దూకుడుతో ఇప్పుడు వైసీపీలోని కాపు నేతలు డిఫెన్స్ లో పడ్డారు. ఎలాగోలా పవన్ ను అడ్డుకోకపోతే తాము భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇప్పుడు కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల తరువాత కాపులు ముఖ్యమంత్రిగా అయితే తాము ఆహ్వానిస్తామని…పవన్ అయినా పర్వాలేదన్న సంకేతాలిచ్చారు. అక్కడే తమ లాజిక్ ను ప్రదర్శించారు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ తహతహలాడుతున్నారని.. కాపుల ఓట్లను గుంపగుత్తిగా చంద్రబాబుకు అమ్మడానికే ఈ ప్లాన్ అంటూ సరికొత్త వక్రభాష్యం చెబుతున్నారు. రాజమండ్రిలో సమావేశమైన కాపు మంత్రులు, ఎమ్మెల్యేలకు హైకమాండ్ కొన్ని సూచనలు చేసినట్టుంది. అందుకే ఇప్పుడు కాపులతో పాటు చంద్రబాబు సామాజికవర్గం మధ్య చీలిక తెచ్చేలా సరికొత్త గేమ్ ను మొదలు పెట్టారు.

2019 ఎన్నికలతో పవన్ కథ ముగిసినట్టేనని రాజకీయ ప్రత్యర్థులు సంబరపడ్డారు. కానీ ఓటమిని పట్టించుకోకుండా మొండి పట్టుదలతో పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చిన పవన్ 2024 ఎన్నికల్లో జనసేనను బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇందులో చాలావరకూ సక్సెస్ అయ్యారు. అటు ప్రజల మైండ్ సెట్ కూడా మారింది. ఇన్నాళ్లూ టీడీపీ, వైసీపీకి అవకాశమిచ్చామని.. ఓసారి పవన్ కూడా ఇద్దామని మెజార్టీ ప్రజలు డిసైడ్ అయ్యారు. అయితే జనసేనకు బలం పెరిగిన మాట వాస్తవమే కానీ.. గెలుపునకు అవసరమైన శక్తి చాలదన్నట్టు భావిస్తున్న పవన్ పొత్తుల సంకేతాలిచ్చారు. అప్పటి నుంచి జగన్ సర్కారుకు చలి జ్వరం ప్రారంభమైంది. ఒక రకమైన అభద్రతా భావం కనిపిస్తోంది. అయితే దీనికి అంతటికీ కారణం పవనేనని ..తమ కంట్లో నలుసుగా మారిన జనసేనాని ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టాలన్న ప్రయత్నంలో వారి మధ్య పోరాటాన్ని యుద్దంగా మార్చేశారు.

అయితే తాజాగా రాజమండ్రిలో కేవలం పవన్ ను టార్గెట్ గా చేసుకొని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. దీనికి కొందరు తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చలు జరిపారు. వ్యూహాత్మకంగా పవన్ సీఎం అయితే పర్వాలేదు కానీ..ఇతరుల కోసమే ఆయన పాకులాడుతున్నారని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. జగన్ సర్కారు కాపులకు ప్రాధాన్యమిచ్చిందని.. సంక్షేమ పథకాలు కూడా కేటాయించిందని గుర్తుచేశారు. అటు రాజకీయంగా కూడా జగన్ కాపులకు ప్రాధాన్యమిచ్చారని నేతలు చెప్పుకొచ్చారు. కానీ పవన్ కాపుల ఓట్లను చంద్రబాబుకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నేతలు ఆరోపించారు. అట్లా కాకుండా పవనే సీఎం అవుతామంటే తామంతా సంతోషిస్తామని స్టేట్ మెంట్ ఇచ్చారు. అటు పవన్ ను, ఇటు చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.