Pawan Kalyan
Pawan Kalyan: ఎవర్ని ఎలా వాడాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఇప్పుడు జనసేనాని పవన్ విషయంలో కూడా అదే ఫార్ములాను చంద్రబాబు అనుసరిస్తున్నారు. తాను లేవనెత్తితే ప్రజలు నమ్మరని తెలిసి.. చాలా అంశాలపై పవన్ మాట్లాడేలా చూసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజాగా తాను ప్రకటించిన 2047 విజన్కు సైతం పవన్తో ప్రచారం ఇప్పించుకున్నారు చంద్రబాబు. పంద్రాగస్టు నాడు ప్రధాని మోదీ జాతీయస్థాయిలో విజన్ 2047ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు అదే సమయంలో రాష్ట్రస్థాయిలో విజన్ 2047 ను చంద్రబాబు విశాఖ వేదికగా ఆవిష్కరించారు. ప్రధాని మోదీ లంచగొండితనం, వారసత్వ రాజకీయం, తాత్కాలిక ప్రయోజనాల పై పోరాడితే విజన్ 2047 సాధ్యమని ప్రకటించారు. డెమోక్రసీ, డెమోగ్రఫి, డైవర్సిటీ అనే మూడు ఈ దేశానికి పునాదులుగా చెప్పుకొచ్చారు. మహిళా సాధికారిత, స్వచ్ఛభారతం, శ్రేష్ట భారతం వంటి వాటిని ప్రస్తావించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఆవశ్యకతను వివరించారు. ఇవన్నీ చేస్తే 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా నిలుస్తుందని ప్రధాని మోదీ తన విజన్ ను ప్రకటించారు. అదే సమయంలో చంద్రబాబు తన విజన్ 2047 ను విడుదల చేశారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల్లో.. జాతీయ విధానాల్లో ప్రథమ స్థానంలో నిలిచేది మాత్రం జనసేన. చంద్రబాబు, జగన్ కంటే పవన్ లోనే జాతీయ భావాలు అధికం. అందుకే మొన్న పంద్రాగస్టు వేడుకల్లో పవన్ తన ప్రసంగంలో విజన్ 2047 పైనే మాట్లాడారు. భారతదేశ అభివృద్ధిపై కీలక ప్రసంగం చేశారు. ఏపీ భవిష్యత్తు పైనా మాట్లాడారు. విజన్ 2047 సక్రమంగా అమలు జరిగితే దేశంలో ఏపీ సైతం అగ్రగామిగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు. అయితే కేవలం పవన్ మిత్రపక్షంగా ఉన్న బిజెపి భావజాలాన్ని చెప్పారు.మోడీ ప్రసంగాన్నే సమర్థించారు.కానీ ఏపీలో రాజకీయ ప్రత్యర్థులు మాత్రం చంద్రబాబు విజన్ నే పవన్ ప్రకటించారని.. సమర్థించారని ప్రచారం మొదలుపెట్టారు.
పవన్ పై విష ప్రచారం విషయంలో వైసిపి తో పాటు టిడిపి కూడా భాగస్వామ్యం అవుతోంది. మొన్నటి చంద్రబాబు విజన్ 2047 ను పవన్ సమర్ధించారంటూ వైసీపీ సోషల్ మీడియా పతాక స్థాయిలో ప్రచారం చేసింది. అటు టిడిపి సోషల్ మీడియా సైతం వైరల్ చేసింది. చంద్రబాబు, పవన్ ఒక్కటేనని చెప్పడం వైసిపి లక్ష్యం. పవన్ ను తమ చెప్పు చేతల్లోకి తీసుకోవాలనుకోవడం టిడిపి లక్ష్యం. అందుకే ఇటువంటి సమయంలో పవన్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జనసైనికులు సూచిస్తున్నారు.