Homeజాతీయ వార్తలుRBI 2000 Note Ban: రెండు వేల నోట్లు సామాన్యుల దగ్గర ఎక్కడున్నాయి?: ఉపసంహరణతో అన్ని...

RBI 2000 Note Ban: రెండు వేల నోట్లు సామాన్యుల దగ్గర ఎక్కడున్నాయి?: ఉపసంహరణతో అన్ని బయటకు వస్తాయా?

RBI 2000 Note Ban: అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది.. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. మెజారిటీ ఆర్థికవేత్తలు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో పెదవి విరుస్తున్నారు.. ఇక నోట్ల ఉపసంహరణ నిర్ణయం పై రాజకీయ పార్టీలు తమ తమ స్టాండ్ కు అనుగుణంగా మాట్లాడుతున్నాయి.. వీళ్ళ అభిప్రాయాలు పక్కనపెడితే దేశం మొత్తానికి చోదక శక్తి మాన్యులే కాబట్టి.. వారు మాత్రం 2000 నోటు ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు.. కొంతకాలంగా ఆ నోటు కనిపించడం లేదని, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకుంటే వచ్చే నష్టం ఏముందని వారు అంటున్నారు.

సామాన్యుల దగ్గర లేవు

నిజానికి సామాన్యులు చెప్పినట్టు 2000 నోటు సర్క్యులేషన్ ఎప్పుడో ఆగిపోయింది.. లావాదేవీల్లో ఎక్కువ శాతం 500 నోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటినుంచో 2000 నోట్లను ప్రింట్ చేయడం నిలిపివేసింది. బ్యాంకులకు కూడా వాటిని సరిపడా చేయడం ఆపివేసింది. బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఆ నోట్లు ఇవ్వడం దాదాపుగా రద్దు చేశాయి. ఈ ఉపసంహరణ అనేది రాత్రికి రాత్రి జరిగింది కాదని, కొంతకాలంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తోందని బ్యాంకులు చెబుతున్నాయి. ఇప్పుడు అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది కాబట్టి గందరగోళం ఏర్పడదని అవి వివరిస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాలు ఏమంటున్నాయంటే

నగదు రూపంలో బ్లాక్ మనీ దాచుకున్న వారికి ఈ నిర్ణయం షాక్ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం, రాజకీయ నేతలు, ప్రభుత్వాల్లో భారీగా లంచాలు వచ్చే విభాగాల్లో ఉన్న వారి దగ్గర 2000 నోట్లు భారీగా పోగుపడి ఉంటాయి. ఇక మరికొద్ది నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక్కో ఓటుకు బొక్క నోటు పంపిణీ చేసేందుకు రాజకీయ పార్టీలు ముఖ్యంగా, అధికార పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుకుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అలాంటి నల్లధనాన్ని పోగేసుకొని ఉన్న పార్టీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం ఎదురుదెబ్బ లాంటిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలో వారికి గత నోట్ల రద్దు సమయంలోనే అనుభవంలోకి వచ్చింది కాబట్టి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం వల్ల కాస్త నష్టం జరిగినప్పటికీ తిరిగి చలామణిలోకి తెచ్చుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్త సీరియస్ గా ఉంటే బయటకు వచ్చే బ్లాక్ మనీ మూలాలు కనిపెట్టడం పెద్ద విషయం కాదు. నగదులాబాదేవులు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడి నుంచే బ్లాక్ మనీ వస్తుంది. ఆ మూలాలు లాగితే చాలామంది జాతకాలు వెలుగులోకి వస్తాయి. దీనిని కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా తీసుకుంటుందా అనేదే ఇప్పుడు ప్రశ్న.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular