
2014 – 2019 సంవత్సరాల మధ్య ఐదేళ్ల పదవీ కాలంలో తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ప్లస్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే 2019 ఎన్నికల్లో టీడీపీపై ఉన్న వ్యతిరేకతే వైసీపీ ఘన విజయానికి కారణమైంది. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లతో అసాధారణ విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అనతి కాలంలోనే మంచిపేరు తెచ్చుకుంది.
Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో 90 శాతం హామీలను జగన్ సర్కార్ ఇప్పటికే అమలు చేసింది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే రాష్ట్రంలో ఈపాటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఉండేవి. మార్చి నెలలో ఎన్నికలు జరిగి ఉంటే రాష్ట్రమంతటా వైసీపీకి ఘన విజయం సొంతమయ్యేది. అయితే ఎవరూ ఊహించని విధంగా వ్యాప్తి చెందిన కరోనా, లాక్ డౌన్ వైసీపీ పాలిట శాపంగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. జగన్ సర్కార్ ఎంత గొప్పగా పాలించినా అధికారంలోకి వచ్చిన పార్టీపై నెలలు గడిచే కొద్దీ కొంత వ్యతిరేకత పెరగడం సహజం. ఏపీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జగన్ సర్కార్ 2,250 రూపాయల పెన్షన్ ను 2,500 రూపాయలకు పెంచకపోవడం, రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడం వైసీపీకు మైనస్ గా మారాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే నెలలు గడిచే కొద్దీ వైసీపీకి మెజారిటీ స్థానాలు మాత్రం తగ్గే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పుంజుకుంటే మాత్రం వైసీపీకి కొత్త కష్టాలు మొదలైనట్లేనని చెప్పవచ్చు.
Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!





