పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోతో తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదం మరింత ముదురుతోంది. నదీజలాల విషయంలో రాష్ట్రానికి నష్టం జరిగితే ఉపేక్షించే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
నీళ్ల విషయంలో తనకు స్పష్టమైన, స్ఫటిక సదృశమైన అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. రాయలసీమ పట్ల తనకు సానుభూతి ఉన్నప్పటికీ కృష్ణాజలాలను అదనంగా తరలిస్తామంటే ఊరుకొని ప్రసక్తి లేదని స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను రాయలసీమకు తరలించామని సలహా ఇచ్చామని చెబుతూ, గోదావరి జలాలను ఎంతగా వాడుకున్నా తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు డైవర్షన్ కెనాల్ విస్తరణపై తమ వ్యూహాలు తమకున్నాయని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిపిన కేటాయింపుల మేరకు మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం మని స్పష్టం చేస్తూ తమ ప్రాజెక్ట్ లపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలనుఁ తోసిపుచ్చారు.
ఆ ప్రకారమే అందరూ ఉండాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ వివాదాల జోలికి తనకు పొదలచుకోలేదని, సమయం వచ్చినప్పుడు అంతా మాట్లాడతానని తెలిపారు.
మరోవంక, తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని అతిక్రమించి ప్రాజెక్టులు చేపడుతోందని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) కి ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఫిర్యాదు చేశారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా మిగులు జలాలు ఉన్నాయని, 5 కొత్త ప్రాజెక్టులు తెలంగాణ చెప్పట్టిందని ఆయన ఆరోపించారు.
అపెక్స్ కౌన్సిల్, సిడబ్యుసి, కేఆర్ఎంబి అనుమతి లేకుండానే తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ లు సమర్పించాలని కేంద్రం గతంలోనే కోరినా, ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్ లు సమర్పించలేదని గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు పొందిన ప్రాజెక్టులను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగు నీటి అవసరాల కోసం అనుమతి ఇచ్చారనీ కేఆర్ఎంబి కి తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు వారిగా వాడుకున్న నీటి లెక్కలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇచ్చిన అనుమతుల వివరాలను కేఆర్ఎంబి చైర్మన్ కు ఏపీ అధికారులు అందించారు.