AP Capital City Vizag: ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం సంచలనం రేపుతోంది. గత 600 రోజులుగా అమరావతి రాజధాని తరలించొద్దని రైతులు ధర్నా చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించింది. కానీ ఈ విషయంలో ఇప్పటికీ ముందడుగు పడలేదు. అమరావతి నుంచి రాజధానిని మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలను రైతులు, తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డు చెబుతున్నాయి. దీంతో హైకోర్టులో సైతం విచారణ జరుగుతోంది. మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సీఎం జగన్ సిమ్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖను రాజధానిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బొత్స వ్యాఖ్యలపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల వ్యవహారంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరుతున్నారు.
ఏపీ రాజధానిగా విశాఖను గుర్తిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై 26న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేరళలోని కన్నూర్ లోక్ సభ సభ్యుడు కుంబకూడా సుధాకరన్, అస్సాంలోని నోవగ్ గావ్ సభ్యుడు ప్రద్యుత్ బొర్డొలాయ్ అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానం చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటుకు ఓకే చేసింది.
కేంద్రం విడుదల చేసిన డేటా ఇప్పుడు వైరల్ అవుతోంది. విశాఖను రాజధానిగా ప్రకటించడంపై తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రైతుల ఉద్యమాలను లెక్కలోకి తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసన తెలుపుతోంది. విశాఖను రాజధానిగా చేయడంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలని సూచిస్తోంది. ప్రజల ఆగ్రహాన్ని లెక్కలోకి తీసుకోకుండా నిర్ణయాలు చేయడంపై విమర్శలు చేసింది.