NASA : నాసా చేతిలో విక్రమ్.. ఇంతకీ ఎలా ఉందో చూశారా?

నాసా ఇస్రో ఘనతను గుర్తించక తప్పడం లేదు. చివరికి తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో సాధించిన విజయాలను గొప్పగా చెప్పుకుంటున్నది.

Written By: NARESH, Updated On : September 6, 2023 8:31 pm
Follow us on

NASA : మనం చేసిన పనిని.. మన వాళ్ళ కంటే పరాయి వాళ్ళు గుర్తిస్తేనే బాగుంటుంది. మనం సాధించిన విజయాన్ని మన వాళ్ళ కంటే.. పరాయి వాళ్ళు కీర్తిస్తేనే కిక్ వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఆనందాన్ని ఇస్రో అనుభవిస్తోంది. ఎప్పుడో తాతల కాలం నాడు చంద్రుడి పైకి వ్యోమగాములను పంపిన అమెరికా.. ఇప్పటివరకు అలాంటి ప్రయోగాన్ని మళ్ళీ చేయలేకపోయింది. ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కాలు మోపలేకపోయింది. కానీ ఇదే ఘనతను అతి తక్కువ ఖర్చుతో ఇస్రో సాధించింది. తన తురుపు ముక్కలు ప్రజ్ఞాన్ ల్యాండ్ రోవర్, విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడి దక్షిణ ధ్రువం మీదికి దింపిన ఇస్రో.. తాను అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు వెళ్తోంది. దాదాపు 14 రోజులపాటు పరిశోధనలు చేపట్టిన ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ప్రస్తుతం చంద్రుడిపై చీకటి కావడంతో స్లీప్ మోడ్ లో ఉన్నాయి. చంద్రుడి గ్రహం మీద సూర్యోదయం అయితేనే అవి యాక్టివ్ అవుతాయి. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆసక్తికరమైన ఫోటో తీసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాసా కు చెందిన స్పేస్ క్రాఫ్ట్ “ది లూనార్ రికగ్నైజేషన్ ఆర్బిటర్” చంద్రుడి దక్షిణ ధ్రువం పై ఉన్న ల్యాండర్ విక్రమ్ ను గుర్తించి ఫోటో తీసింది. ఇటీవల తీసిన ఈ ఫోటోను ట్విట్టర్ ఎక్స్ ద్వారా నాసా షేర్ చేసింది. ” ఇస్రో చంద్రయాన్_3 ను ప్రయోగించింది. ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువానికి 600 కిలో మీటర్ల దూరంలో ఇస్రో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ దిగింది” అని ఇస్రో ట్విట్టర్ ద్వారా పేర్కొన్నది.

నాసాకు చెందిన ఎల్ ఆర్ ఐ కెమెరా వాలు వీక్షణలో (42 డిగ్రీల స్లీవ్ యాంగిల్) ఈ ఫోటో తీసింది. ల్యాండర్ విక్రమ్ చుట్టూ అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తోందని పేర్కొన్నది. కాగా,మేరీ ల్యాండ్ లోని గ్రీన్ ల్యాండ్ నుంచి ఎల్ ఆర్ వో ను నాసాకు చెందిన గొడ్డార్డ్ స్పేస్ ప్లైట్ సెంటర్ నిర్వహిస్తూ ఉంటుంది. కాగా, ఎప్పుడో 1980 ల్లో ప్రయోగాలు చేసిన నాసా.. చంద్రుడు మీదికి వ్యోమగాములను పంపినట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రయోగాలు చేయలేదు. చివరికి చంద్రుడి మీద నీటి ఆనవాళ్లు, సల్ఫర్ నిల్వలు ఉన్నట్టు గుర్తించలేకపోయింది. కానీ ఈ విషయాలను ఇస్రో తాను పంపిన శాటిలైట్ల ద్వారా గుర్తించింది. ఇదే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అప్పట్లో నాసా దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ చంద్రయాన్_3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ దృవం మీదకు.. భారత్ విక్రం లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను ల్యాండ్ చేయడంతో.. నాసా ఇస్రో ఘనతను గుర్తించక తప్పడం లేదు. చివరికి తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో సాధించిన విజయాలను గొప్పగా చెప్పుకుంటున్నది.