Vijay Resort Politics: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఫలితాలు ఇంకా వెల్లడి కాకముందే తమిళనాడు రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ వేస్తున్న అడుగులు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు ఎన్నికల్లో రెండు స్థానాలలో పోటీ చేశారు.. అన్ని స్థానాలలో ఆయన అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఎన్నికలకు ముందు విజయ్ అనేక రకాలైన ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. ఆయన నటించిన జననాయగన్ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. దీనికి తోడు ఆయన నిర్వహించిన సభలో ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఈలోగా ఆయన భార్య విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కేసు ఇంకా కోర్టు విచారణలో ఉంది. ఇదంతా జరుగుతుండగానే విజయ్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి.. పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు.
విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేవలం ఒకే ఒక్క సర్వే సంస్థ మాత్రమే బయట పెట్టింది. మిగతా సంస్థలు విజయ్ పార్టీకి అంతగా సీట్లు రావని స్పష్టం చేశాయి. అయినప్పటికీ టీవీకే నేతలు ధైర్యంతోనే ఉన్నారు. అధికారం తమదేనని చెబుతున్నారు.. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు ఇంకా వెల్లడి కాకముందే రిసార్ట్ రాజకీయానికి విజయ్ తెర లేపారు. ఎన్నికల ఫలితాలు వెళ్లడైన వెంటనే అభ్యర్థులు మహాబలిపురంలోని రిసార్ట్ కు రావాలని వర్తమానం పంపారు. పార్టీ లోని కీలక నాయకులు ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఫోన్ చేసి.. సమాచారాన్ని పంపించినట్లు తెలుస్తోంది. ఇటీవల కూడా విజయ్ మహాబలిపురంలోనే ఒక రిసార్ట్లో మీటింగ్ పెట్టారు. అప్పట్లో ఆయన నిర్వహించిన సభలో ప్రాణ నష్టం చోటు చేసుకున్న నేపథ్యంలో.. వారందరితో అక్కడే సమావేశం నిర్వహించి.. ఆర్థిక సహాయం అందించారు.
ఇప్పుడు కూడా మహాబలిపురం ప్రాంతంలోనే ఓ రిసార్ట్ ను విజయ్ బుక్ చేశారు.. ఒకవేళ తమిళనాడులో డీఎంకేకు, అన్నా డీఎంకేకు సమాన స్థానాలు వస్తే.. అప్పుడు విజయ్ పార్టీ కీలకం అయ్యే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే విజయ్ కింగ్ మేకర్ అవుతారు. బహుశా ఆ ఆలోచనతోనే విజయ్ రిసార్ట్ బుక్ చేసినట్టు తెలుస్తోంది. మహాబలిపురం ప్రాంతంలోకి ఇప్పటికే చాలామంది టీవీకే నేతలు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు పార్టీ అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. విజయ్ రిసార్ట్ బుక్ చేసినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అన్నా డిఎంకె, డిఎంకే నేతలు కూడా తమ పార్టీ అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు.