Usha Naidu : కాంగ్రెస్ లో మన తెలుగు బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది.. తాజాగా ఏఐసీసీ పలు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కీలక నియామకాలు చేసింది.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు. ఆయన టూర్ షెడ్యూల్, ప్రచారానికి సంబంధించిన పూర్తి బాధ్యతలను నిర్వహించడానికి.. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలతో సమన్వయం కోసం ఏఐసీసీ సెక్రటరీలను నియమించారు. నాలుగు రాష్ట్రాలకు ఈ నియామకాలు జరిగాయి.
ప్రస్తుతం గుజరాత్ లో ఏఐసీసీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ లోని పొన్నూరు నియోజకవర్గానికి చెందిన ఉషానాయుడుకు ఏకంగా రాజస్థాన్ లో ఏఐసీసీ ప్రెసిడెంట్ పాల్గొనే పర్యటనకు సంబంధించిన మొత్తం కార్యక్రమాలు, పర్యవేక్షణ సమన్వయకర్త బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఎన్నికల వేళ వీరు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ప్రచార సభల పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఉషానాయుడు కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఏకంగా ఏఐసీసీ సెక్రటరీగా గుజరాత్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రాజస్థాన్ లో కీలక బాధ్యతలు అందుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉషా నాయుడుకు మంచి భవిష్యత్తు ఉంటుందని పొన్నూరు వాసులు ఈ నియామకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.