
ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు అమెరికా గుడ్ బై చెప్పింది. అమెరికా – చైనా ల మధ్య చిచ్చు పెట్టిన కరోనా మహమ్మారి చివరకు ఈ పరిణామానికి దారితీసింది డబ్ల్యూహెచ్వోతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల సంభవించిన మరణాలు, విధ్వంసాలకు ఆ సంస్థ, చైనాలే కారణమని ఆయన మరోసారి ఆరోపించారు. ఇప్పటివరకు డబ్ల్యూహెచ్వోకు ఇస్తున్న నిధులను ప్రజా ఆరోగ్య సంస్థలకు మళ్లించనున్నట్లు వెల్లడించారు.
కరోనాను కట్టడి చేసే విషయంలో డబ్ల్యూహెచ్వో విఫలమైనట్లు ట్రంప్ కొద్దిరోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. నెల రోజుల కిందట ఆ సంస్థకు నిధులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్. తాజాగా డబ్ల్యూహెచ్వోతో పూర్తిగా సంబంధాలు వదులుకుంటున్నట్లు ప్రకటించారు.
అంతటితో ఆగకుండా, వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ మరి కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. చైనీస్ కు అమెరికాలో ప్రవేశంపై నిషేధం విధిస్తామని, చైనా పెట్టుబడులకు వ్యతిరేకంగా రూల్స్ కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు. హాంకాంగ్ ప్రజల స్వాతంత్రంను హరించేలా ఉన్న చైనా జాతీయ భద్రతా బిల్లును ట్రంప్ తప్పుపట్టారు.
ఇక హాంకాంగ్ ఇచ్చిన స్పెషల్ స్టేటస్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. మునుపెన్నడూ లేనంతగా అమెరికాను చైనా కొల్లగొడుతోందని ఆరోపించారు. అమెరికా టెక్నాలజీని, మేధో సంపత్తిని దొంగిలించి వాడుకుంటోందని, బిలియన్ డాలర్ల విలువైన ఉద్యోగాలను పోగొట్టేందుకు కారణమైందని మండిపడ్డారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ పట్ల కూడా తన నిబద్ధతను ఉల్లంఘించిందని, ఇండో-పసిఫిక్ మహాసముద్రంలో చట్టవిరుద్ధంగా భూభాగాలను క్లెయిమ్ చేసిందని, నావిగేషన్..అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని ఆరోపించారు. వైరస్ ను అంటగట్టిన చైనా.. ప్రపంచానికి చాలా సమాధానాలు చెప్పాల్సి ఉందని హెచ్చరించారు.