
మోడీ2.0 ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి లేఖ రాశారు. గతేడాది ఇదే రోజు మోడీ ప్రధానిగా రెండోవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల ఆదరాభిమానాలతో ఏడాది పాలన పూర్తిచేసుకున్నామని, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పేదల గౌరవం ఇనుమడిస్తుందని మోడీ తెలిపారు. తన ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా గ్రామీణ-పట్టణాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సవాళ్లను ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం గడిచిన ఏడాదిలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుందన్నారు. అదేవిధంగా దేశం వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు.
మన దేశం ఎన్నో సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటుందని ప్రధాని తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు రాత్రనక, పగలనక తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉందని తనకు తెలుసన్నారు. తనలో లోపాలు ఉండొచ్చు.. కానీ దేశానికి కాదన్నారు. కాబట్టే తనకంటే దేశ ప్రజల్ని, వారి బలాన్ని, వారి సామార్థ్యాలను నమ్ముతున్నట్లు తెలిపారు. దేశం స్వావలంబన దిశగా పయనిస్తుందని, ఆర్థిక పునరుజ్జీవనంలో భారతదేశం ఒక ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ ప్రపంచాన్ని ఆశ్యర్యపరుస్తుందన్నారు. భారతీయుల సమిష్టి బలం, సామర్థ్యంతో ఇది నిరూపితమైందన్నారు. ఇందుకు మీరే కారకులన్నారు. ప్రపంచంలోని శక్తివంతమైన, సంపన్న దేశాలతో పోల్చితే ఇది అసమానం అన్నారు. చప్పట్లు చరవడం గానీ, దీపాలు వెలిగించడం గానీ, కరోనా యోధులను ఆర్మీ గౌరవించడం గానీ, జనతా కర్ఫ్యూ గానీ, దేశవ్యాప్త లాక్ డౌన్ నియమాలను కచ్చితంగా పాటించడం ఇలా ప్రతి సందర్భంలోనూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని నిరూపించారని ప్రధాని పేర్కొన్నారు.