TSPSC Paper Leak Case: పేపర్ లీక్ కు ముందు.. కర్మాన్ ఘాట్ లోని ఓ హోటల్లో రేణుక, డాక్యా

TSPSC Paper Leak Case: ఆమె ఓ టీచర్,అతడు టెక్నికల్ అసిస్టెంట్..ఇద్దరూ భార్యా భర్తలు. డబ్బు కోసం దారి తప్పారు. తప్పుడు పనులు చేశారు. ఇప్పుడు దొరికి పోయారు. ఏఈ ప్రశ్నపత్రం లీకేజీలో కీలకపాత్ర పోషించిన రేణుక, ఢాక్యాలు ఎగ్జామ్‌కు రెండు రోజుల ముందు కర్మన్ ఘాట్‌లోని ఓ హోటల్లో రెండు గదులు అద్దెకు తీసుకొన్నారు. నీలేష్‌, గోపాల్‌ను ప్రిపేర్‌ చేయించారు. ఈ నెల 5న సరూర్‌నగర్‌లో వారితో పరీక్ష రాయించారు. హోటల్‌ యజమాని, రిసెప్షనిస్టులను సాక్షులుగా […]

Written By: Bhaskar, Updated On : March 25, 2023 9:27 am
Follow us on

TSPSC Paper Leak Case

TSPSC Paper Leak Case: ఆమె ఓ టీచర్,అతడు టెక్నికల్ అసిస్టెంట్..ఇద్దరూ భార్యా భర్తలు. డబ్బు కోసం దారి తప్పారు. తప్పుడు పనులు చేశారు. ఇప్పుడు దొరికి పోయారు. ఏఈ ప్రశ్నపత్రం లీకేజీలో కీలకపాత్ర పోషించిన రేణుక, ఢాక్యాలు ఎగ్జామ్‌కు రెండు రోజుల ముందు కర్మన్ ఘాట్‌లోని ఓ హోటల్లో రెండు గదులు అద్దెకు తీసుకొన్నారు. నీలేష్‌, గోపాల్‌ను ప్రిపేర్‌ చేయించారు. ఈ నెల 5న సరూర్‌నగర్‌లో వారితో పరీక్ష రాయించారు. హోటల్‌ యజమాని, రిసెప్షనిస్టులను సాక్షులుగా చేర్చి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. పేపర్‌ లీకేజీలో మొత్తం 19 మందిని సాక్షులుగా చేర్చారు.

గ్రూప్‌-1 లీకేజీతో లింక్‌ ఉందా?

ఏఈ ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్న రేణుక, ఢాక్యానాయక్‌కు గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీతో కూడా సంబంధాలున్నట్లు సిట్‌ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో రేణుక, ఢాక్యా, ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిలను మరో 5 రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతించాల్సిందిగా సిట్‌ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కొత్తగా అరెస్టయిన ఇద్దరు టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు షమీమ్‌, రమేశ్‌తోపాటు మాజీ ఉద్యోగి సురేశ్‌ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటిషన్ వేశారు. కాగా, మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలో ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ రెడ్డి ఏఈ పరీక్ష రాశారు. విచారణ నేపథ్యంలో ఇతని పేరు బయటకు రావడంతో శుక్రవారం సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో పాటు షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి, నవాబ్‌పేటకు చెందిన మరో ఇద్దరిని కూడా సిట్‌ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూపు-1 ప్రశ్నపత్రం కోసం రూ.7.50 లక్షలు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. రాత్రి 11 గంటల తర్వాత కూడా సిట్‌ అధికారులు వీరిని విచారిస్తున్నట్లు తెలిసింది.

TSPSC Paper Leak Case

కమిషన్ సభ్యుడి పీఏ కూడా..

ముఖ్యంగా గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పెను దూమారం లేపుతోంది. టీఎస్ పీఎస్సీలో ఉద్యోగాలు చేస్తూ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాసి మొయిన్స్‌కు అర్హత సాధించిన 8 మందిని విచారించిన క్రమంలో షమీమ్‌ అనే ఉద్యోగినితో పాటు రమేశ్‌కు పేపర్‌ లీకేజీతో సంబంధం ఉన్నట్లు తెలింది. కాగా.. సురేశ్‌ ద్వారా రమేశ్‌కు, ప్రవీణ్‌ నుంచి షమీమ్‌కు ప్రశ్నపత్రం అందినట్లు అధికారులు గుర్తించారు. కమిషన్ లోని ఓ సభ్యుని వద్ద రమేశ్‌ పీఏగా పనిచేస్తుండగా, సురేశ్‌ మాజీ ఉద్యోగి. ఇక షమీమ్‌ 2013లోనే గ్రూప్‌-2 ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం టీఎస్ పీఎస్సీ గ్రూప్‌-4 సెక్షన్ లో ఏఎస్వో గా పనిచేస్తోంది.

40 మందిని విచారిస్తే..

100కు పైగా మార్కులు వచ్చిన 120 మందిలో ఇప్పటి వరకు 40 మందిని సిట్‌ విచారించింది. మిగిలిన 80 మందికీ నోటీసులు ఇచ్చారు. వీరిలో పేపర్‌ లీకేజీతో ఎంతమందికి సంబంధాలు ఉన్నాయో తేలాల్సి ఉంది. ఒకవేళ ఎవరికైనా ప్రశ్నపత్రం అందినట్లు తేలినా.. పెద్దవాళ్ల పిల్లలు ఉన్నా.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిట్‌ అధికారులు అంటున్నారు.

లీకేజీ లో ఎన్ఆర్ఐ లు

80 మందిలో కొందరు ఎన్‌ఆర్‌ఐలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. టీఎస్ పీఎస్సీ ఉద్యోగులను విచారించిన క్రమంలో రాజశేఖర్‌, ప్రవీణ్‌ ద్వారా గ్రూప్‌-1 పేపర్‌ వారికి వాట్సాప్ లో వచ్చిందని గుర్తించిన పోలీసులు.. ప్రవీణ్‌ను, రాజశేఖర్‌ను మరోసారి విచారించారు. రాజశేఖర్‌ న్యూజిలాండ్‌లో ఉంటున్న తన బావ ప్రశాంత్ రెడ్డికి వాట్సాప్ లో ప్రశ్నపత్రం పంపినట్లు తేలింది. అతను న్యూజిలాండ్‌ నుంచి వచ్చి అక్టోబరు 16న గ్రూప్‌-1 పరీక్ష రాయగా.. 103 మార్కులతో మెయిన్స్ కు ఎంపికైనట్లు గుర్తించారు. దీంతో ప్రశాంత్ ను విచారణకు హాజరు కావాల్సిందిగా సమాచారం ఇచ్చామని, సకాలంలో హాజరు కాకపోతే లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. అయితే శుక్రవారమే ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అతన్ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. ప్రశాంత్ ను అరెస్టు చేయడం ఖాయమని తెలుస్తోంది.