ఇప్పటికే యావత్ దేశాన్ని ప్రైవేటీకరణ వైపు బాటలు పట్టిస్తున్న ప్రధాని మోడీ.. సామాన్యులను కూడా వదలడం లేదు. ఇప్పటికే పెట్రో రేట్లు భగ్గుమంటుండగా.. గ్యాస్ సబ్సిడీకి మంగళం పాడారు. దేశ ప్రజలు కరోనాతో కష్టాలతో పోరాడుతుంటే.. ఆదుకోవాల్సిన కేంద్రం బడా కంపెనీలకు ఊరటనిచ్చిందంటూ ఆరోపణలు వినిపించాయి. కరోనా టైమ్లో కేంద్రం తీసుకున్న ప్రతీ నిర్ణయం కూడా బడా కంపెనీలకు మేలు చేసేవే కానీ.. సామాన్యులకు ఊరటనిచ్చింది ఏదీ లేదని ఇప్పటికీ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. దీనికితోడు దేశంలో ప్రధాన రంగాలను తప్ప మిగితా ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తామంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. ఇప్పటికే ఏపీలోని ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వాహనదారులపై టోల్ పిడుగు పడింది.
జాతీయ రహదారులపై టోల్ రుసుములు పెంచుతూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో వాహనానికి ఇరువైపులా కలిపి కనిష్ఠంగా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.25 వరకు, నెలవారి పాస్కు కనిష్ఠంగా రూ.90 నుంచి గరిష్ఠంగా రూ.590 వరకు, లోకల్ పాస్కు రూ.10 వరకు పెంచారు. హైదరాబాద్–విజయవాడ (65), హైదరాబాద్–భూపాలపట్నం (163) జాతీయ రహదారులను బీవోటీ పద్ధతిలో నిర్మించారు. కాంట్రాక్టర్లకు ఏడాదికోసారి టోల్ రుసుములను పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఎన్హెచ్ఏఐ ఆమోదించడంతో యాదాద్రి జిల్లాలోని పంతంగి, గూడురు, నల్గొండ జిల్లాల్లోని కొర్లపహాడ్, ఏపీలోని జగ్గయ్యపేట చిల్లకల్లు వద్ద జాతీయ రహదారులపై ఉన్న టోల్ప్లాజాల వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచే కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. ఏడాదికాలం పాటు ఇవే అమలులో ఉంటాయి.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్కు సింగిల్ అయితే రూ.80, అప్ అండ్ డౌన్ అయితే రూ.120, లైట్ కమర్షియల్, గూడ్స్ వెహికల్, మినీ బస్సుకు సింగిల్ రూ.130, అప్ అండ్ డౌన్ కలిపి రూ.190, బస్సు, ట్రక్కు (2 యాక్సిల్)కు సింగిల్ రూ.265, అప్ అండ్ డౌన్కు కలిపి రూ.395గా నిర్ణయించారు.
కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్కు సింగిల్ అయితే రూ.110, అప్ అండ్ డౌన్ కలిపి రూ.165, లైట్ కమర్షియల్, గూడ్స్ వెహికల్, మినీ బస్సుకు సింగిల్ రూ.175, అప్ అండ్ డౌన్ కలిపి రూ.260, బస్సు, ట్రక్కు (2 యాక్సిల్)కు సింగిల్ రూ.360, అప్ అండ్ డౌన్ కలిపి రూ.540గా నిర్ణయించారు.
హైదరాబాద్–భూపాలపట్నం జాతీయ రహదారిపై గూడురు టోల్ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్కు సింగిల్ రూ.100, అప్ అండ్ డౌన్ కలిపి రూ.150, లైట్ కమర్షియల్, గూడ్స్ వెహికల్, మినీ బస్సుకు సింగిల్ రూ.150, అప్ అండ్ డౌన్ కలిపి రూ.225, బస్సు, ట్రక్కు (2 యాక్సిల్)కు సింగిల్ రూ.305, అప్ అండ్ డౌన్ కలిపి రూ.460గా నిర్ణయించారు. భారీ, అతి భారీ వాహనాల రుసుములు కూడా రూ.20 నుంచి రూ.35 వరకు పెరిగాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్