పశ్చిమబెంగాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా నడుస్తోంది. బీజేపీ ఎత్తులకు మమత బెనర్జీ పై ఎత్తులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. పార్టీ నుంచి ఎంత మంది వలస వెళ్లినా చెక్కుచెదరకుండా దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. మమత లోకల్ నినాదాన్ని ఎత్తుకోవడంతో ఇప్పుడు బీజేపీ ఇరుకున పడినట్లైంది. ‘‘హమారా బంగ్లా’’ నినాదాన్ని మమత బెనర్జీ ఎత్తుకోవడంతో బీజేపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
గుజరాతి పార్టీగా మమత బెనర్జీ ప్రతి సభలోనూ బీజేపీని దుయ్య బడుతున్నారు. ఇది మమత బెనర్జీకి కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. మమత బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించకుండా ఎలాగైనా అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ నేతలను తన పార్టీలోకి చేర్చుకుంది. వారిని బంగ్లా ద్రోహులుగా మమత బెనర్జీ ప్రకటించారు. బయట వ్యక్తుల చేతుల్లోకి పాలన వెళితే రాష్ట్రం బాగుపడదన్న ప్రచారాన్ని మమత బెనర్జీ జోరుగా చేస్తున్నారు. కేవలం కొన్ని రాష్ట్రాలకే బీజేపీ అధినాయకత్వం పట్టించుకుంటుందని, మిగిలిన రాష్ట్రాలను గాలికి వదిలేస్తుందని మమత బెనర్జీ ప్రతి సభలోనూ విమర్శలకు దిగుతున్నారు.
పెట్రోలో, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచడం కూడా మమత బెనర్జీకి కలిసి వచ్చే అంశంగానే చెప్పాలి. సామాన్య మధ్య తరగతి ప్రజలు పెట్రో భారాన్ని మోయలేకపోతున్నారు. వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు మమత బెనర్జీ మోదీ, షాలను టార్గెట్ చేసుకున్నారు. తాను బెంగాలీనని, బెంగాలీయేతరులకు ఇక్కడ స్థానం లేదని మమత బెనర్జీ గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నారు. ఢిల్లీల రిమోట్ ఉంటుందని, ఢిల్లీ పాలన కావాలా..? దీదీ పాలన కావాలా? అని ఆమె ప్రజలను సూటిగా ప్రశ్నిస్తున్నారు.
మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న టార్గెట్తోనే మమత డిసైడ్ అయిపోయారు. అందుకే.. ఈ మధ్య కాలంలో బంగ్లా నినాదాన్ని ఎక్కువగా వినిపించడం కూడా అందుకేనంటున్నారు రాజకీయ నిపుణులు. జై బంగ్లా అంటూ ఆమె ప్రచారం ముగించే సమయంలో చేయడం ఎత్తుగడలో భాగమేనట. బయట వ్యక్తులకు ఇక్కడ స్థానం లేదని చెబుతూనే, వారి చేతిలో బెంగాల్ ఇరుక్కుంటే ఇక ఎవరూ రక్షించలేరని ప్రజలకు నూరిపోస్తున్నారు. మొత్తం మీద మమత బెనర్జీ తన మార్క్ ఆలోచనతో మరోసారి బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నమే చేస్తోంది. లోకల్ నినాదంతో మమత బెనర్జీ ముందుకు వెళ్తోంది.