Homeజాతీయ వార్తలుథర్డ్ వేవ్ ఖాయం: మళ్లీ కోవిడ్ పంజా

థర్డ్ వేవ్ ఖాయం: మళ్లీ కోవిడ్ పంజా

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రధానంగా కరోనా వైరస్ ‘డెల్టా’ రకం వ్యాప్తి తీవ్రంగా ఉంది. అన్ని దేశాల్లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. టీకాలు పెద్ద ఎత్తున వేసిన అమెరికాలోనూ గత కొద్దిరోజులుగా మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజులో 92వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఇన్ని ఎక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతకుముందు రోజు 84 వేల మందికి పైగా వైరస్ బారినపడ్డారు.

ఇక కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలోనూ డెల్టా వైరస్ కేసులు పంజా విసురుగుతున్నాయి. చైనా రాజధాని బీజింగ్ తోపాటు మరో 14 నగరాల్లో ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 2019 డిసెంబర్ లో వూహాన్ లో తొలిసారి కరోనా విజృంభించిన తర్వాత ఇదే అత్యంత తీవ్ర పరిస్థితిగా చైనా అధికారిక మీడియా తెలిపింది.చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ పరిధిలో అధికసంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో విమానాల రాకపోకలు నిలిపివేశారు.బీజింగ్ లో 175 రోజుల తర్వాత మళ్లీ కేసులు పెరుగుతుండడం గమనార్హం. చైనా జనాభాలో ఇంతవరకు 40శాతం మందికి టీకాలు వేసినట్లు అధికారిక మీడియా తెలిపింది.

ఇక జపాన్ లో అయితే ‘వైరస్ ఎమర్జెన్సీ’ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించారు. రాజధాని టోక్యోలో ఇప్పటికే ‘అత్యవసర పరిస్థితి’ ఉంది. మరో 4 ప్రాంతాల్లోనూ అమలుకు శుక్రవారం నిర్ణయించారు. టోక్యో సమీపంలోని సైతమా, కనగావా, చిబాలతోపాటు ద్వీపాల్లోనూ ఆగస్టు 31 వరకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు జపాన్ ప్రకటించారు. జపాన్ లో గురువారం 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో బార్లు, హోటళ్లలో మధ్యపాన నిషేధం వంటివి చేపడుతున్నారు.ఆస్పత్రి పడకలు సరిపోక వేల మంది ఎదురుచూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్ ఆతిథ్యం వల్లే జపాన్ లో కేసులు పెరిగాయని .. ప్రధాని తీరుపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 41649 పాజిటివ్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. క్రితంతో పోలిస్తే ఇది ఆరు శాతం మేర తగ్గాయి. నిన్న మరో 593 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసులు 3.16 కోట్లకు చేరాయి. 4.23 లక్షల మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దీన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరిగాయని అర్తమవుతోంది. థర్డ్ వేవ్ మళ్లీ ముసురుకుంటుందన్న ఊహాగానాలు వెల్లడవుతున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version