Site icon OkTelugu

Revanth Reddy- Congress Senior Leaders: బెడిసి కొట్టిన సీనియర్ల ప్లాన్‌.. రేవంత్‌దే పై‘చేయి’!

Revanth Reddy- Congress Senior Leaders: తెలుగుదేశం నుంచి వచ్చాడు.. మాపై పెత్తనం చేస్తున్నాడు అనుకున్నారు.. ఎలా అయినా ఆయనకు పీసీసీ పదవి దక్కకూడదని ప్లాన్‌ చేశారు. కానీ.. అది సాధ్యం కాలేదు. తాజాగా పీసీసీ కమిటీల ప్రకటనలో కూడా ఆయనదే పై‘చేయి’ అయింది. దీంతో తిరుగబాటు మొదలు పెట్టారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని ఆ పదవి నుంచి తప్పిద్దామనుకున్నారు. అసలైన కాంగ్రెస్‌వాదులం తామే అని.. ఆయన పెత్తనం ఏంటి అనే సందేశం అధిష్టానానికి పంపాలనుకున్నారు. కానీ సీనియర్లు చేసిన రాజకీయం మాత్రం రివర్స్‌ అయింది. సీనియర్ల వ్యూహానికి ప్రతివ్యూహం పన్నిన రేవంత్‌రెడ్డి పార్టీని కంప్లీట్‌గా తన చేతుల్లోకి తీసుకున్నాడు. టీపీసీసీ కమిటీలను ఏర్పాటు చేసిన హైకమాండ్‌ వాటి సమావేశాలనూ నిర్వహించాని ఆదేశించింది. రేవంత్‌రెడ్డి నిర్వహించారు. అందరూ వచ్చారు కానీ.. సీనియర్లుగా కొత్త కుంపటి పెట్టుకున్న 9 మంది మాత్రమే హాజరు కాలేదు. దీంతో వారు తప్ప.. మిగతా పార్టీ అంతా ఏకతాటిపైకి ఉన్నట్లు తేలింది. అంతే కాదు.. ఆ పార్టీ అంతా రేవంత్‌ వైపు ఉన్నట్లుగా స్పష్టమయింది.

Revanth Reddy- Congress Senior Leaders

సీనియర్ద స్వార్థపై హైకమాండ్‌కు ఫిర్యాదు..
తామే అసలైన కాంగ్రెస్‌ వాదులం అని చెప్పుకుంటున్న 9 మంది సీనియర్లు ఉద్దేశపూర్వకంగా, స్వార్థపూరితంగా పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు టీపీసీసీ ఇప్పటికే హైకమాండ్‌కు నివేదిక పంపింది. కుట్ర పూరితంగా కాంగ్రెస్‌పై టీడీపీ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని నేతలు నివేదిక పంపారు. కమిటీల్లో కనీసం 13 మంది కూడా టీడీపీ నుంచి వచ్చిన వారు లేకపోయినా సగం మందికిపైగా ఉన్నారని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని వారు వీడియోలను హైకమాండ్‌కు సమర్పించారు. ఇక కార్యవర్గ సమావేశంలో రేవంత్‌రెడ్డి పాదయాత్రను ప్రకటించారు. పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇక ఆయన పాదయాత్రకు తిరుగులేదని తేలిపోయింది. మరోవైపు కార్యవర్గ సమావేశాలకే హాజరు కాలేదంటే.. ఇక కాంగ్రెస్‌ పార్టీలో.. సీనియర్ల పరిస్థితి ఉన్నా లేనట్లేనని భావిస్తున్నారు. వారిని ఇక కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ కూడా ప్రోత్సహించదని.. కనీసం అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వడం కష్టమేనని అంటున్నారు.

Revanth Reddy- Congress Senior Leaders

 

డ్యామేజ్‌ బ్యాచ్‌గా ముద్ర..
కాంగ్రెస్‌లోని 9 మంది సీనియర్లు తాము నిజమైన కాంగ్రెస్‌ వాదులమని చెప్పుకుంటూ పార్టీని డ్యామేజ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌వర్గం ఆరోపిస్తోంది. ఈమేరకు అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. ఆ 9 మందిని డ్యామేజ్‌ బ్యాచ్‌గా పేర్కొంటూ.. కాంగ్రెస్‌ పార్టీని బలహీనపర్చి బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి.. మరింత ముందుకెళ్లి అందరూ బీజేపీలోకి రావాలని పిలుపునివ్వడం రేవంత్‌ వర్గానికి కలిసి వచ్చింది. ఎలా చూసినా కాంగ్రెస్‌ సీనియర్ల వ్యవహారం.. రేవంత్‌రెడ్డికి ప్లస్‌గా మారింది. ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంటే కాంగ్రెస్‌ పార్టీలో ఉండాలి.. లేకపోతే బయటకు వెళ్లిపోవాలన్న పరిస్థితిని ఆ తొమ్మిది మంది స్వయంగా తెచ్చుకున్నారు. దీంతో రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీపై పూర్తిస్థాయి పట్టు లభించింది.

Exit mobile version