Kolkata Doctor Case: కోల్ కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో అమాయకుడిని బలి పశువును చేశారా? ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో?

కోల్ కతా లోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న శిక్షణ వైద్యురాలు హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశం మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 24, 2024 5:58 pm

Kolkata Doctor Case(1)

Follow us on

Kolkata Doctor Case: కోల్ కతా శిక్షణ వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి విచారణ సాగిస్తున్న సిబిఐకి అనుకోని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా ఈ కేసు మరింత జటిలంగా మారే అవకాశం కనిపిస్తోంది.. ఈ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ ని సిబిఐ అధికారులు కోర్టు ఎదుట హాజరు పరిచారు. గతంలో సిబిఐ అధికారుల పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష చేసేందుకు కోర్టు ఒప్పుకుంది. సంజయ్ రాయ్ కూడా దానికి సమ్మతం తెలిపాడు. అయితే ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. “నన్ను అకారణంగా ఇరికించారు. నాకు ఎలాంటి పాపం తెలియదు. నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని” నిందితుడు న్యాయస్థానం ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో జాతీయ మీడియాలో విభిన్న కథనాలు ప్రసారమవుతున్నాయి. “పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు నువ్వు ఒప్పుకుంటున్నావ్” అని మేజిస్ట్రేట్ ప్రశ్నించినప్పుడు.. సంజయ్ భావోద్వేగానికి గురైనట్టు జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా తెలుస్తోంది. “నేను ఎలాంటి తప్పు చేయలేదు? నేను అమాయకుడిని. నన్ను కారణం లేకుండా ఇందులో ఇరికించారు. మీరు చెబుతున్న పాలిగ్రాఫ్ పరీక్ష ద్వారా అసలు విషయం వెల్లడవుతుందని” సంజయ్ పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా ఈ కేసు మరో టర్న్ తీసుకుంది.

అయితే ఇటీవల తన నేరాన్ని సంజయ్ ఒప్పుకున్నాడని, సిబిఐ విచారణ సమయంలో అతడు ఆ విషయాన్ని స్పష్టం చేశాడని వార్త కథనాలు వెలువడ్డాయి. మరోవైపు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ చెందిన వైద్యులు సంజయ్ మానసిక తీరును విశ్లేషించారు. అతడి ఆరోగ్యం బాగానే ఉందని నివేదిక ఇచ్చారు.”అతడిని మేము పరీక్షించాం. ఆ ఘటనలో ప్రతి నిమిషం ఏం జరిగిందో అతడు పూసగొచ్చినట్టు వివరించాడు. అతనిలో పెద్దగా పశ్చాతాపం కనిపించలేదు. అంత చెబుతున్నప్పటికీ అతడు ఏమాత్రం భయపడలేదు. పైగా ఒక గర్వం అతడి కళ్ళల్లో కనిపించింది. ఇక ఇలాంటి సందర్భంలో ఇంతకంటే ఇంకోతిరిగా చెప్పాల్సిన అవసరం లేదు అని నాకు అనిపిస్తోంది. ఈ నివేదిక మేము అధికారులకు ఇచ్చాము. తదుపరి విచారణ వారు చూసుకుంటారని” సంజయ్ ని విచారించిన ఫోరెన్సిక్ వైద్య బృందంలో పాల్గొన్న ఓ అధికారి అప్పట్లో పేర్కొన్నారు.

ఇక ఈ ఘటన జరిగిన తర్వాత అర్ధరాత్రి సమయంలో సంజయ్ వెళ్తున్న దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. వాటిని దర్యాప్తు అధికారులు ఇటీవల మీడియాకు విడుదల చేశారు. సంజయ్ మెడ చుట్టూ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనిపించాయి. సెమినార్ గదిలోనే వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన ప్రాంతంలో ఆ బ్లూటూత్ ను పోలీసులు కనుగొని, స్వాధీనం చేసుకున్నారు. ఈ రికార్డుల ప్రకారమే అతడిని అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. ఇక సంజయ్ కి ఇప్పటికే నేస్తానం 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నిందితుడితోపాటు మరో ఏడుగురికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని కోర్టు అనుమతి ఇచ్చింది. ఫలితంగా వారందరికీ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సిబిఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.