
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో డ్రగ్స్ ముఠాలను.. డ్రగ్స్ మాఫీయాలను చూశాం. ఎంతో మందిని మన ఆఫీసర్లు పట్టుకున్నారు కూడా. కానీ.. ఇంకా డ్రగ్స్ జాడలు మాత్రం తొలగడం లేదు. డ్రగ్స్ మాఫియాకు ఎంత అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తూనే.. రోజు ఏదో మూలనా ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. కాగా.. ఇప్పటివరకూ సినిమా వాళ్లతో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాలు చాలావరకే వెలుగు చూశాయి. సినీ ఫీల్డ్లో ఈ డ్రగ్స్ వినియోగం ఎక్కువే. అందుకే.. చాలా మందిని పోలీసులు పట్టుకున్నారు కూడా. వారి మీద కేసులు కూడా నమోదు చేశారు. ఇన్నాళ్లు సినీ పరిశ్రమలోనే ఆ డ్రగ్స్ వినియోగం ఉందనుకుంటే.. ఇప్పుడు ఈ రొంపిలో పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఇరుక్కున్నట్లు వెల్లడైంది. తాజాగా.. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇందులో ఇరుక్కున్నారు. ఈ వ్యవహారంలో చిన్నస్థాయి తెలుగు హీరో కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. బెంగళూరులో పోలీసులకు చిక్కిన డ్రగ్స్ సరఫరా ముఠా వద్ద తీగ లాడితే అది తెలంగాణ వరకూ పాకింది.
కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న మత్తుమందుల కేసులో తెలంగాణ ప్రజాప్రతినిధుల ప్రమేయంపై బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిలో ఇప్పటికే ఓ ఎమ్మెల్యే పేరు నిర్ధారణ కాగా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకూ సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన మత్తు మందు పార్టీల్లో కూడా వీరు పాల్గొన్నారని.. తాను తెలంగాణ ఉద్యమకారుడినంటూ బెంగళూరు పోలీసులకు చెప్పుకున్న ఓవ్యక్తి వీటిని సరఫరా చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఓ కన్నడ నటుడికి చెందిన బెంగళూరు హోటల్లో జరిగే మత్తు పార్టీలకు కూడా వీరు తరచూ హాజరయ్యేవారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఓ చిన్నపాటి తెలుగు సినీ హీరోను రెండు రోజులపాటు విచారించి కీలక సమాచారం సేకరించారు.
ఫిబ్రవరి 26న బెంగళూరు తూర్పు డివిజన్ పోలీసులు నవగరా సర్వీసు రోడ్డులో సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియాకు చెందిన హారిసన్, జాన్నాన్సోలను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.4 కోట్ల విలువైన 350 గ్రాముల ఎండీఎంఏ టాబ్లెట్స్, 4 గ్రాముల కొకైన్, 82 ఎక్స్టసీ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా.. తమతోపాటు మత్తు మందు సరఫరా చేస్తున్న నైజీరియాకే చెందిన ఉస్మాన్, లోకొండోల పేర్లు వెల్లడించారు. పోలీసుల గాలింపులో లోకొండో పట్టుడ్డాడు. అతని నుంచి 526 ఎల్ఎస్డీ స్ట్రిప్స్, 200 గ్రాముల కొకైన్, 2.7 కిలోల ఎండీఎంఏ, 1,930 ఎక్స్టసీ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో జాన్నాన్సో మరికొందరు ప్రముఖుల పేర్లు చెప్పాడు. అందులో మస్తాన్చంద్ర అనే వ్యక్తి పేరు ఉంది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఆయన.. బిగ్ బాస్ 4 సీజన్లోనూ పాల్గొన్నాడు. మస్తాన్ను విచారించినప్పుడు తాను.. కేశవ్ అనే మరో వ్యక్తి కలిసి పబ్బులు, హోటళ్లు, రిసార్టులు, అపార్ట్మెంట్లలో మత్తమందు పార్టీలు నిర్వహిస్తామని వెల్లడించాడు.
అయితే.. మస్తాన్చంద్ర బెంగళూరులో శంకరగౌడ అనే సినీ నిర్మాత, స్థిరాస్తి వ్యాపారి నిర్వహించిన పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేశాడు. దాంతో శంకరగౌడ్ ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేశారు. చివరకు ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు. అయితే.. ఈ శంకరగౌడ్ బెంగళూరులో ఇచ్చిన పార్టీలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేతోపాటు మరికొందరు పాల్గొన్నారు. ఆ పరిచయంతో హైదరాబాద్లో జరిగిన పార్టీలకు కూడా శంకరగౌడ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది. పోలీసులు దీనికి సంబంధించి కొన్ని వీడియో ఫుటేజీలు సంపాదించినట్లు చెప్తున్నారు.
హైదరాబాద్ వ్యాపారి సందీప్ రెడ్డిని ఇటీవల బెంగళూరు పోలీసులు విచారించారు. సందీప్ రెడ్డి, సికింద్రాబాద్కు చెందిన మరో వ్యాపారి కలహార్ రెడ్డి ఫ్రెండ్స్. కలహార్రెడ్డికి కన్నడ సినీ పరిశ్రమలో పరిచయాలు ఉన్నాయి. దీంతో సందీప్ రెడ్డిని కన్నత నిర్మాత శంకరగౌడకు పరిచయం చేశాడు. బెంగళూరులో కొన్ని ఖాళీ స్థలాలున్నాయని.. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఉంటే చెప్పాలని శంకరగౌడ్ కోరాడు. దీంతో సందీప్రెడ్డి తనకు పరిచయం ఉన్న ఎమ్మెల్యేతోపాటు మరికొందరిని తీసుకొని బెంగళూరు వెళ్లాడు. అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందులో మత్తు మందులు సరఫరా చేశారు. తర్వాత 2019 ఆస్టులో శంకరగౌడ తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన పార్టీకి సందీప్ రెడ్డితోపాటు ఓ చిన్నపాటి తెలుగు హీరో, ఎమ్మెల్యే, ఉద్యమకారుడిగా చెప్పుకునే మరో వ్యక్తి హాజరయ్యారు. హైదరాబాద్ తిరిగి వచ్చేటప్పుడు సదరు ఉద్యమకారుడు శంకరగౌడ నుంచి కొకైన్ తీసుకొచ్చాడు. ప్రస్తుతం పోలీసులు అనుమానితులను విచారిస్తుండగా.. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్యేలను విచారించనున్నారు. వీరిలో ఓ ఎమ్మెల్యేకు ఒకట్రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయబోతున్నట్లు సమాచారం.