బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు పేరు కూడా అనౌన్స్ చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి యాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఈ పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ అని పేరు పెట్టారు. హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. అయితే.. ఈ యాత్ర కన్నా ముందు పలు సందేహాలు బయలుదేరాయి.
పార్టీకి సంబంధించిన పాదయాత్ర అంటే.. ఎవరైనా ఒకరు చేస్తారు. కానీ.. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఇద్దరు నేతలు యాత్రకు సిద్ధమవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇది పార్టీ శ్రేణులను సైతం అయోమయానికి గురిచేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ పేరుతో పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటు బండి సంజయ్ కూడా ఇంచుమించు కొద్ది రోజుల తేడాతోనే యాత్ర చేపట్టడం ఏంటనే ప్రశ్న తెరపైకి వస్తోవంది.
అంతేకాదు.. అటు ముఖ్యమైన ఉప ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కీలకమన్నది తెలిసిందే. కేసీఆర్ ఢీకొట్టే క్రమంలో తాము మళ్లీ ఫామ్ లోకి వచ్చామని చాటుకోవడానికి ఈ ఎన్నిక బీజేపీకి చాలా అవసరం. మరి, అలాంటి ఎన్నిక సందర్భంలో కీలక నేతలు పాదయాత్ర అంటూ రాష్ట్రం పట్టుకు తిరగడం ఏంటనే సందేహం కూడా వస్తోంది.
దీనంతటికీ బీజేపీలోని గ్రూపులే కారణమనే చర్చ సాగుతోంది. తెలంగాణ బీజేపీలో మూడు గ్రూపులు ఉన్నాయనే ప్రచారం గట్టిగా సాగుతోంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని ఫలితాలు సాధించింది. దీంతో.. బీజేపీ తరపున సీఎం అభ్యర్థి బండేనని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకున్నారు కూడా. దీనిపై సీనియర్లు గుర్రుగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అందుకే.. ఈ యాత్రను ఆపడానికి కూడా చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ వెంట ఇప్పటి వరకు పెద్ద నేతలు కనిపించకపోవడానికి కారణం ఈ గ్రూపులే అని కూడా అంటున్నారు. మొత్తానికి ఇటు కేసీఆర్ తో పోరాటం సాగిస్తూనే.. ఎవరికి వారు తమను ప్రొజెక్ట్ చేసుకోవడానికి కమలం నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.