Homeఅంతర్జాతీయంPanjshir : పోరుగడ్డ పంజ్ షీర్ వైపు తాలిబన్లు.. ఏం జరుగనుంది?

Panjshir : పోరుగడ్డ పంజ్ షీర్ వైపు తాలిబన్లు.. ఏం జరుగనుంది?

Panjshir ValleyPanjshir Valley: అఫ్గానిస్తాన్(Afghanistan) లో తాలిబన్ల (Taliban) పాలన అరాచకం సృష్టిస్తోంది. అక్కడ ఉన్న ప్రజలంతా భయభ్రాంతులతో కాలం వెళ్లదీస్తున్నారు. దేశం విడిచిపోవాలని ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ లోని ఓ ప్రాంతం మాత్రం వారికి భయపడడం లేదు. వారిని ఎదిరించేందుకు రొమ్ము విరుచుకుని మరీ నిలబడుతున్నారు. అదే పంజ్ షీర్(Panjshir) ప్రావిన్సు. తాలిబన్లు మాత్రం ఆ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకీ తీసుకుంటామని ప్రకటనలు చేస్తున్న క్రమంలో అక్కడి వారు మాత్రం తేల్చుకుంటామని చెబుతున్నారు. భారీస్థాయిలో ఆయుధ సామగ్రితో ఆ ముఠా ఫైటర్లు వందల సంఖ్యలో పంజ్ షీర్ కు బయలుదేరినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ ప్రాంత వాసులు మాత్రం తాలిబన్లకు భయపడేది లేదని చెబుతున్నారు. పంజ్ షీర్ సైన్యం కూడా పోరాటానికి సిద్ధమని ప్రకటిస్తోంది.

కాబుల్ కు ఉత్తరాన సుమారు 150 కిలోమీటర్ల దూరంలో హిందుకుష్ పర్వత శ్రేణుల్లో పంజ్ షీర్ ఉంది. ఇక్కడ జనాభా లక్షన్నర. అత్యధికులు తజిక్ జాతీయులే. పంజ్ షీర్ అంటే సంస్కృతంలో ఐదు సింహాలు అని అర్థం. పేరుకు తగినట్లే ఇక్కడి వారిలో ధైర్యం ఎక్కువ. ఎంతటి తెగువకైనా సిద్ధమే. గతంలో జరిగిన పోరాటాల్లో సైతం వీరు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి తమ ప్రాంతాన్ని తాలిబన్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకున్నారు. ఇప్పుడు కూడా అదే భరోసాతో ఉన్నారు. తాలిబన్లకు తలొగ్గేదే లేదని చెబుతున్నారు.

1980లో తాలిబన్లు, సోవియట్ సైన్యం కానీ దీన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు. నాటి పోరాటంలో దిగ్గజ మిలటరీ కమాండర్ అహ్మద్ షా మసూద్ పంజ్ షీర్ ను ముందుండి ఉద్యమానికి నాయకత్వం వహించారు. తాలిబన్లు, అల్ ఖైదా ముష్కరులు సంయుక్తంగా కుట్ర పన్ని విలేకరుల వేషంలో జరిపిన ఆత్మాహుతి దాడిలో 2001లో ఆయనను పొట్టన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రులా్లా సలేహ్ పంజ్ షీర్ గడ్డపై తాలిబన్లపై పోరాటానికి వ్యూహాలు రచిస్తున్నారు. తండ్రి బాటలో తాలిబన్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అహ్మద్ మసూద్ ప్రకటించారు. తమ బలగాలకు ఆయుధాలు అందజేయాల్సిందిగా అమెరికాను ఇటీవల కోరారు.

ఓ పక్క దేశమంతా అట్టడుకుతున్నా పంజ్ షీర్ మాత్రం తెగువ చూపడం గమనార్హం. తాలిబన్ల ఆగడాలను సహించేది లేదని చెబుతున్నారు. వారిని సమర్థంగా ఎధుర్కొని తమ ప్రాంతాన్ని శత్రుదుర్భేధ్యంగా మారుస్తామని పేర్కొంటున్నారు. తమ జోలికి వస్తే తాలిబన్లకు తగిన మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. తాలిబన్ల దారుణాలతో అఫ్గాన్ ప్రజలు విసిగిపోతున్నారు. దేశం విడిచిపెట్టాలని చూస్తున్నా ఎయిర్ పోర్టులో ఇనుప కంచెలు ఏర్పాటు చేసి అందరిని భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంజ్ షీర్ ప్రాంత వాసుల తెగువను అందరు ప్రశంసిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version