‘‘మహిళల హక్కులు కాపాడుతాం.. వారు ఉద్యోగాలు కూడా చేయొచ్చు.. వారి స్వేచ్ఛకు సంకెళ్లు వేయబోము’’ ఇవీ.. ఆఫ్ఘన్ ఆక్రమణ తర్వాత తాలిబన్లు చెప్పిన మాటలు. కానీ.. ఆ మాటలన్నీ నీటి మూటలేనని తేల్చేస్తున్నాయి వారి చర్యలు. తాలిబన్లు తీసుకుంటున్న నిర్ణయాలు మహిళల ఆశలకు, ఆశయాలకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. మొన్న కో-ఎడ్యుకేషన్ పై నిషేధం విధించిన తాలిబన్లు.. తాజాగా మరో ఫత్వా జారీచేశారు. దీంతో.. వారి నిజస్వరూపం బయట పడుతోంది.
తాలిబన్లు జారీచేసిన తొలి ఫత్వాలో.. విద్యాసంస్థల్లో కో-ఎడ్యుకేషన్ నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. హెరాత్ ప్రావిన్స్ లో తొలుత అమలుకు ఆదేశించారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, యాజమాన్యాలతో చర్చల అనంతరం ఈ ఫత్వాను తాలిబన్లు జారీచేశరు. తాజాగా మరో ఫత్వా జారీచేశారు. ఇందులో. సంగీతంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. దీని ప్రకారం.. రేడియో, టీవీ ఛానళ్లలో మహిళలు పనిచేయడం నిషేధం. ఈ రెండు ఫత్వాల ద్వారా మహిళలను మళ్లీ వంటింటికి పరిమితం చేసే నిర్ణయాలు తీసుకున్నారు తాలిబన్లు.
దేశంలో ప్రజాస్వామ్యం ఉండబోదని, షరియా చట్టాల ప్రకారమే పాలన సాగుతుందని ఇప్పటికే తాలిబన్లు ప్రకటించారు. షరియా చట్టాలు అంటే.. రాతియుగాల నాటి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. వీటి ద్వారా ప్రధానంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారికి కనీస హక్కులు కూడా ఉండవు. పదేళ్లు దాటిన బాలికలు చదువు కోకూడదు. చదువుకునేది కూడా మత గ్రంథాలే అయి ఉండాలి. మహిళలు గడపదాటి బయటకు రాకూడదు. ఒకవేళ రావాల్సి వస్తే.. మగతోడు ఖచ్చితంగా ఉండాలి. అది కూడా కుటుంబ సభ్యుడే అయి ఉండాలి. వాళ్ల ముఖం ఎవ్వరికీ చూపించకూడదు. ఇలా.. ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తారు. ఈ విధంగా.. స్త్రీ కేవలం ఇంట్లో వాళ్లకు వండిపెట్టడానికి, భర్తకు సుఖాన్నిస్తూ పిల్లలను కనిపెట్టడానికి మాత్రమే అన్నట్టుగా చెబుతాయి షరియా చట్టాలు.
1996 నుంచి 2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో ఇవే ఆంక్షలు అమలు చేశారు. అయితే.. 2001 తర్వాత అమెరికా సైన్యాలు ఆఫ్గన్ లో అడుగు పెట్టడం.. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పరిస్థితులు మారిపోయాయి. మహిళలంతా చదువుకోవడం మొదలు పెట్టారు. ఉద్యోగాలు కూడా చేస్తూ వచ్చారు. తమకు నచ్చిన విధంగా బతికారు. కానీ.. ఇప్పుడు మళ్లీ ఆఫ్ఘన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో.. పాత కాలంలోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇదిలాఉంటే.. అటు తాలిబన్ల ఆధీనంలో లేని పంజ్షీర్ పైనే ప్రపంచం దృష్టి నెలకొంది. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు చుట్టు ముట్టారని, పంజ్ షీర్ అధినేత లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే.. వాస్తవ పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియరావట్లేదు. పంజ్ షీర్ లో ఇంటర్నెట్ ను తాలిబన్లు నిలిపేసినట్టు సమాచారం. ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమృల్లా సలేహ్ పంజ్ షీర్ లోనే ఉన్నారు. ఆయన ట్విటర్, ఇతర కార్యకలాపాలు సాగకుండా.. తాలిబన్లు ఇంటర్నెట్ బంద్ చేసినట్టు సమాచారం. ఈ విధమైన పరిస్థితుల్లో.. అక్కడ ఏం జరుగుతోందన్నది బయటి ప్రపంచానికి పూర్తిస్థాయిలో తెలియట్లేదు. మరి, పంజ్ షీర్ సేనలు.. తమ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. తాలిబన్లపై యుద్ధానికి సిద్ధమవుతున్నారా? లొంగిపోతున్నారా? అసలు అక్కడ ఏం జరుగుతోంది అనేది తెలియాలంటే.. కాస్త వేచి చూడాల్సిందే.