YSRCP: వైసీపీలో విభేదాలు ముదురుతున్నాయా? నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందా? పార్టీలో క్రమశిక్షణ కట్టుదాటుతోందా? నాయకుల్లో అభద్రతా భావం పెరుగుతోందా? అధిష్టానంపై అసహనం తీవ్రమవుతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ..చిత్తూరు నుంచి కడప వరకూ అధికార వైసీపీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి.నేతలు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుతున్నారు. పొమ్మన లేక పొగ పెడుతున్నారు. మంత్రి పదవి దక్కించుకున్నవారు..మంత్రి పదవులు పోగొట్టుకున్న వారు.. మంత్రి పదవి ఆశించి దక్కకపోయినా వారు..ఇలా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ తరువాత జిల్లాల్లో అసమ్మతి స్వరాలు పెరిగాయి. రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. అయితే ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం అన్నచందంగా పరిస్థితి ఉండడంతో పార్టీ హై కమాండ్ కూడా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.
ఆగని నెల్లూరు రగడ..
అధికార పార్టీకి పట్టున్న జిల్లాల్లోఉమ్మడి నెల్లూరు ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ వైసీపీ మంచి ఫలితాలు సాధిస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో స్వీప్ చేసింది. దీంతో మంత్రివర్గ కూర్పు జగన్ కు కష్టంగా మారింది. జిల్లా నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ చాన్స్ ఇచ్చారు. అయితే గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందగా..మంత్రివర్గ విస్తరణలో అనిల్ పదవిని పోగొట్టుకున్నారు. అనూహ్యంగా కాకాని గోవర్థన్ రెడ్డి చాన్స్ దక్కించుకున్నారు. అప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. పదవి పోయిన ప్రస్టేషన్ లో అనిల్, పదవి వచ్చిందని కాకాని, పదవి రాలేదన్న భాదతో ఆనం రామానారాయణ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇలాఅందరు వర్గాలుగా విడిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ వీరెవర్నీ లెక్క చేయలేదు.పైగారివేంజ్ రాజకీయాలు నడిపేవారు. ఇప్పుడు మాజీ అవ్వడంతో ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ వారే తన వెనుక గోతులు తవ్వుతున్నారంటూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనిల్ ఓటమికి మిగతా నాయకులు పావులు కదుపుతున్నారన్నది ఆయన అనుమానం. దీంతో నెల్లూరు రాజకీయాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.
Also Read: Noida Twin Towers: నోయిడా ట్విన్ టవర్స్ ఎందుకు కూల్చేస్తున్నారు? దాని వెనుక అసలు కారణాలేంటి?
ప్రకాశంలో సేమ్ సీన్..
అటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఏమంత పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇక్కడ టీడీపీ గ్రాఫ్ పెంచుకునే పనిలో ఉండగా వైసీపీ మాత్రం వర్గాలతో రచ్చకెక్కుతోంది. ఇక్కడ తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మంత్రిగా ఒక వెలుగు వెలిగిన బాలినేని ప్రస్తుతం ఎమ్మెల్యే అయిపోయారు. దీంతో ఆయన మానసికంగా పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. మంత్రివర్గ విస్తరణ సమయంలో తనను మంత్రిగా కొనసాగించాలని విన్నవించారు. ఒక వేళ తొలగించాలంటే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను కూడా తొలగించాలని ఆయన కోరారు. కానీ జగన్ మాత్రం అతడ్ని మంత్రివర్గం నుంచి తొలగించారు. సురేష్ ను కొనసాగించారు. అయితే తన మంత్రి పదవి పోవడానికి, రాజకీయంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పార్టీలో సీనియర్ నేతే కారణమంటూ బాలినేని ఆరోపిస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడంతో బాధపడుతున్నారు.
చాలా నియోజకవర్గాల్లో..
దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి , ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొందరు బయటపడుతున్నారు. మరికొందరు సమయం కోసం వేచిచూస్తున్నారు.అయితే అధిష్టానం మాత్రం పట్టించుకోవడం లేదు. నేతలతో తమకేమి పని.. అంతా జగన్ ను చూసి ఓటేస్తారన్న ధీమా వారిలో కనిపిస్తోంది. అందుకే నాన్చుడి ధోరణితో అధిష్టానం నెట్టుకొస్తోంది. దీంతో సీఎం జగన్ కు సన్నిహితులుగా ఉన్నవారు సైతం మీడియా ముందుకొస్తున్నారు. బాలినేని, అనిల్ కుమార్ యాదవ్ లు ఇద్దరు సీఎం సన్నిహితులే. కానీ వారి విన్నపాలను అధిష్టానం బుట్టదాఖలు చేయడంతో వారు బ్లాస్ట్ అవుతున్నారు. పార్టీపై కాకుండా నేతలపై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఇప్పటివరకైతే నేతలతో సరిపెడుతున్నారు. మున్ముందు పార్టీపై ఆరోపణలు చేసినా ఆశ్యర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కొత్తగా అదనపు కోఆర్డినేటర్లతో..
అధికార పార్టీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉంది. ఒకరినొకరు దెబ్బ తీసుకునేలా వ్యవహరిస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు ఆ పార్టీనేతలే చెబుతున్నారు. ఇటువంటి సమయంలో అధిష్టానం కఠిన చర్యలకు దిగాల్సిన అవసరముంది. కానీ ఎందుకో ఉపేక్షిస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు అటువంంటి నాయకులను పిలిచి మాట్లాడాల్సిన అధిష్టానం ప్రత్యామ్నాయ హెచ్చిరికలను పంపిస్తోంది. నియోజకవర్గానికి అదనపు కోఆర్డినేటర్లను నియమిస్తోంది.32 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా కోఆర్డినేటర్లను నియాకం జరపనుంది. అయితే ఇది సత్ఫలితాలనివ్వకపోగా.. విభేదాలు పెంచే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నారు.
Also Read:Harish Shankar: పవన్ కళ్యాణ్ కోసం ఎన్నేళ్లయిన ఆగుతానంటున్న హరీష్ శంకర్