Director Bobby Father ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్రనాథ్) ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన తండ్రి మరణించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆయన 154వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో తీస్తున్నారు. ఈ సమయంలోనే బాబీ తండ్రి కొల్లి మోహనరావు అనారోగ్యంతో చనిపోవడం విషాదం నింపింది.
కొల్లి మోహనరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనను హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ ఆస్పత్రిలోనే కాలేయ సంబంధిత సమస్యతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మోహన్ రావు ప్రస్తుత వయసు 69 సంవత్సరాలు.
కొల్లి మోహన్ రావు స్వగ్రామం గుంటూరు జిల్లా నాగారం పాలెం. అక్కడే ఆయన అంత్యక్రియలు జరుపనున్నారు. గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగిన దర్శకుడు కేఎస్ రవీంద్ర 2003లో రైటర్ చిన్ని కృష్ణ దగ్గర అసిస్టెంట్ గా తన కెరీర్ ఆరంభించారు. అనంతరం దర్శకుడు దశరథ్, గోపీచంద్ మలినేని వంటి వారి దగ్గర అసిస్టెంట్లుగా పనిచేశారు. భద్రాద్రి సినిమాకు స్టోరీ అందించి సీనీ రంగ ప్రవేశం చేశారు.
బలుపు, అల్లుడు శీను లాంటి సినిమాలకు కథను అందించారు. ఇక ఆ తర్వాత ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. రెండో సినిమాతోనే పవన్ కళ్యాణ్ తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ తీశారు. ఎన్టీఆర్ తో ‘జైలవకుశ’ తీసి హిట్ కొట్టారు. వెంకీతో ‘వెంకీమామ’ తీసి మరో హిట్ ఇచ్చారు. మెగాస్టార్ తో ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా చేస్తున్నారు.
మోహన్ రావు కూడా ఒకప్పుడు రంగస్థల నటుడే. ఎన్నో నాటకాలు వేశాడు. తండ్రి సినిమాలపై ఉన్న ప్రేమనే కుమారుడు బాబీ ఈ రంగం వైపు తీసుకొచ్చి అతడిని దర్శకుడిని చేసింది.