Homeజాతీయ వార్తలుBJP vs Congress : కాంగ్రెస్ కు షాక్.. బిజెపిలోకి మాజీ సీఎం, ఆయన కుమారుడు

BJP vs Congress : కాంగ్రెస్ కు షాక్.. బిజెపిలోకి మాజీ సీఎం, ఆయన కుమారుడు

Kamal Nath – Nakul Nath : పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే నితీష్ కుమార్ బిజెపితో జట్టు కట్టడం.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కమలం పార్టీలో చేరడం.. వంటి పరిణామాలను చవిచూస్తున్న హస్తం పార్టీకి తాజాగా మరో ఉపద్రవం వచ్చి పడింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ త్వరలో బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక అయిన ట్విట్టర్ ఎక్స్ లో బయో లో కాంగ్రెస్ పార్టీ పేరు తొలగించారు. ఆయన బిజెపిలో చేరబోతున్నారు అనే ఊహాగానాలు వ్యక్తమైన నేపథ్యంలో ట్విట్టర్ ఎక్స్ బయో లో కాంగ్రెస్ పార్టీ పేరు తొలగించడం విశేషం. ఈ నేపథ్యంలోనే నకుల్ నాథ్ శనివారం ఢిల్లీ వెళ్లారు.

కమల్ నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. నకుల్ మాత్రమే కాకుండా అతడి తండ్రి కమల్ నాథ్ కూడా బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై కమల్ నాథ్ భిన్నంగా స్పందిస్తున్నారు. “ఇదంతా ఎందుకు రెచ్చిపోతున్నారు. ఒకవేళ నేను పార్టీ మారేది ఏదైనా ఉంటే మీ అందరికీ తెలియజేస్తాను. అప్పటిదాకా కొంచెం సమయమనం పాటించండి.” అంటూ పార్టీ మార్పుపై తనను ప్రశ్నించిన విలేకరులను ఉద్దేశించి కమల్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి పార్ల మెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కమల్ నాథ్ గత ఏడాది డిసెంబర్ వరకు కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన స్థానంలో జితు పట్వారీ కొనసాగుతున్నారు. ప్రస్తుతం కమల్ నాథ్ వయసు 78 సంవత్సరాలు. మధ్యప్రదేశ్లో గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కమల్ నాథ్ బాధ్యత వహించారు. తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జితూ పట్వారీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు..

కమల్ నాథ్, నకుల్ నాథ్ ఇద్దరు కలిసి శనివారం ఢిల్లీ చేరుకున్నారు. త్వరలో వారు బిజెపి అగ్రనేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు పది నుంచి 11 మంది ఎమ్మెల్యేలు కూడా కమల్ నాథ్ తో బిజెపిలో చేరే అవకాశం ఉంది.. అంతేకాదు కమల్ నాథ్ శనివారం చింద్వారా పర్యటన అకస్మాత్తుగా రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లడం విశేషం. కమల్ నాథ్ బిజెపిలో చేరకముందే ఆ పార్టీ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా సామాజిక మాధ్యమాలలో విభిన్నంగా స్పందించారు. కమల్ నాథ్, నకుల్ నాథ్ ఫొటోలు పోస్ట్ చేసి ” జై శ్రీరామ్” అంటూ ట్వీట్ చేశారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు రావాలని ఆహ్వానం పంపిస్తే కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిందని.. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నాయకులు బిజెపిలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీడి శర్మ పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం కమల్ నాథ్, నకుల్ నాథ్ బిజెపిలో చేరబోతున్నారనే వార్తలు వినిపించడం విశేషం. కమల్ నాథ్, నకుల్ నాథ్ బిజెపిలో చేరుతారా అనే ప్రశ్నకు ” రాముడిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అది తెలుసుకున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి వస్తున్నారు. వారికోసం మేము మా తలుపులు తెరిచి ఉంచాం. భారతదేశం తన హృదయంలో రాముడిని కలిగి ఉందని” వీడీ శర్మ విలేకరులతో పేర్కొన్నారు.

మరో వైపు కమల్ నాథ్, ఆయన కుమారుడు బిజెపిలో చేరుతున్నారనే వార్తలను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కొట్టి పారేశారు. ” నిన్న రాత్రి నేను కమల్ నాథ్ తో మాట్లాడాను. ఆయన చింద్వారా లో ఉన్నారు. నెహ్రూ_ గాంధీ కుటుంబంతో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయనకు సోనియా గాంధీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని విడిచిపెడతారని మీరు ఎలా ఆశిస్తున్నారని” దిగ్విజయ్ సింగ్ అన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular