Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: ఏపీలో షర్మిలకు అసలు పరీక్ష

YS Sharmila: ఏపీలో షర్మిలకు అసలు పరీక్ష

YS Sharmila: ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతుంది. నేతల విమర్శలతో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే అక్కడి రాజకీయాలు రంజుగా మారాయి. ఇక మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తాను అని ప్రకటించి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన షర్మిల.. ఏపీలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.. తన అన్న పై విమర్శల బాణం ఎక్కు పెడుతున్నారు. సహజంగా షర్మిల అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి పచ్చ మీడియా ఆమెకు విపరీతమైన హైప్ ఇస్తోంది. ఆమె అధికారంలోకి వస్తుంది అనే అంచనాలు ఉంటే కచ్చితంగా పచ్చ మీడియా వ్యక్తిత్వ హననానికి వెనుకాడదు. ఎందుకంటే గతంలో షర్మిల తన అన్నకు అనుకూలంగా ఉన్నప్పుడు పచ్చ మీడియా ఎలాంటి రాతలు రాసిందో మనం చూశాం. సరే వారి కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు గానీ.. ప్రస్తుతానికైతే జగన్, షర్మిల మధ్య విభేదాలయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె అతనిపై విమర్శలు చేస్తున్నారు. కొన్నిసార్లు లైన్ కూడా తప్పుతున్నారు.

ఇక ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం షర్మిలకు పచ్చ మీడియా విపరీతమైన కవరేజ్ ఇస్తోంది. ఇది సహజంగానే వైసిపి సోషల్ మీడియాకు నచ్చడం లేదు. అందుకే షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా వారియర్లు విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిని ఆపేయాలని జగన్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు.. సరే ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో షర్మిలకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. ఎందుకంటే ఆమె రేపటి నుంచి ఏపీలో 11 ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించనుంది. అయితే ఈ సమావేశాలకు వచ్చే జనం ఆధారంగానే షర్మిల రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందని అక్కడ చర్చ నడుస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైసీపీ తరఫున షర్మిల రెండు తెలుగు రాష్ట్రాలలో పాదయాత్ర నిర్వహించారు. ఓదార్పు యాత్ర నిర్వహించారు. అప్పట్లో సాక్షి షర్మిల యాత్రకు విపరీతమైన కవరేజ్ ఇచ్చింది. జగన్ కు అనుకూలం కాబట్టి షర్మిల పాదయాత్రకు పచ్చ మీడియా కవరేజ్ ఇవ్వలేదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కాబట్టి పచ్చ మీడియా షర్మిలను ఆకాశానికి ఎత్తేస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చే సూచనలుంటే పచ్చ మీడియా వ్యవహార శైలి షర్మిల విషయంలో మరో విధంగా ఉండేది.

ఇక రేపటి నుంచి షర్మిల 11 ప్రాంతాలలో సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జన సమీకరణకు సంబంధించి అక్కడ ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో షర్మిల జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా పాదయాత్ర చేసినప్పుడు జన సమీకరణ బాధ్యతను అప్పటి వైసిపి నాయకులు చూసుకున్నారు. ఇక ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పాదయాత్ర చేసినప్పుడు కూడా పర్వాలేదు అనే స్థాయిలో జనం వచ్చారు.. మరి రేపటి నుంచి షర్మిల అక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జనం ఏ స్థాయిలో వస్తారు అనేది అంతుపట్టకుండా ఉంది. ఒకవేళ ఐదు నుంచి 10,000 మంది జనం వస్తే షర్మిల రాజకీయ భవిష్యత్తుకు డోకా లేదని, ఒకవేళ 5000 మంది వస్తే పర్వాలేదు అని, అంతకంటే తగ్గితే మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ కు, లోకేష్ కు వచ్చినట్టు జనం వస్తే మాత్రం కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పునరుజ్జీవం పొందుతున్నట్టుగా అర్థం చేసుకోవాలని వారు చెబుతున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పార్టీల సభలకు జన సమీకరణ అనేది చెల్లించే డబ్బులు మీదే ఆధారపడి ఉంటున్నది. అలాంటప్పుడు షర్మిల తన సభలకు భారీగా డబ్బు ఖర్చు చేస్తే.. జనం బాగా వస్తే. అప్పుడు పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అయితే ఏపీలో జగన్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ స్థాయిలో జన సమీకరణ సాధ్యమా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల అసలు సిసలైన పరీక్ష రేపటి నుంచి ఎదుర్కోబోతున్నారు. మరి ఇందులో నెగ్గుతారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version