BBC: కుక్కతోక వంకర.. బిబిసి పాత్రికేయం కూడా అంతే..

తాజాగా అయోధ్య రామ మందిరం ప్రారంభం కావడం.. అందులో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగడం.. ఈ కార్యక్రమాన్ని అన్ని మీడియా సంస్థలు భారీగా ప్రసారం చేశాయి. కానీ నెత్తి మాసిన బిబిసి మాత్రం పక్షపాత ధోరణి ప్రదర్శించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 5, 2024 12:22 pm
Follow us on

BBC: ఊరందరిదీ ఒక దారి అయితే.. ఉలిపి కట్టేది మరో దారి.. అచ్చం ఈ సామెత బి బి సి కి వర్తిస్తుంది. పేరుకేమో ప్రఖ్యాత ఛానల్ అని డబ్బా కొట్టుకుంటుంది. దాని పాత్రికేయ ప్రమాణాలు చూస్తే నేలబారుతనం గుర్తుకువస్తుంది. ఇప్పటికీ భారత్ అంటే చాలు ఆ ఛానల్ లీటర్ల కొద్ది విషం చిమ్మడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ సమస్యలను భూతద్దంలో పెట్టి చూపించి.. ప్రపంచంలో బదనాం చేయాలని చూస్తుంది. అక్కడిదాకా ఎందుకు ఈ దేశ ప్రధానమంత్రి పై “మోడీ క్వశ్చన్” అనే పేరుతో డాక్యుమెంటరీ తీసి తన ఉద్దేశం ఏమిటో చాటింది. కానీ దానిపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో సామాజిక మాధ్యమాల నుంచి తొలగించింది. అంతేకాదు అప్పట్లో రైతు ఉద్యమాలు జరిగినప్పుడు బిబిసి ఎలాంటి కథనాలు ప్రసారం చేసిందో అందరికీ తెలుసు. అదే యూరప్ ప్రాంతంలో రైతులు ఆందోళన చేస్తుంటే సింగిల్ కాలం వార్త కూడా బీబీసీ ప్రసారం చేయడం లేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు దాని పాత్రికేయ ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి.

తాజాగా అయోధ్య రామ మందిరం ప్రారంభం కావడం.. అందులో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగడం.. ఈ కార్యక్రమాన్ని అన్ని మీడియా సంస్థలు భారీగా ప్రసారం చేశాయి. కానీ నెత్తి మాసిన బిబిసి మాత్రం పక్షపాత ధోరణి ప్రదర్శించింది. ఈ మాట అన్నది ఎవరో కాదు బీబీసీ పుట్టిన బ్రిటన్ దేశంలోని ఎంపీ. అక్కడ తాజాగా హౌస్ ఆఫ్ కామన్స్ జరిగింది. ఈ సందర్భంగా అక్కడి పార్లమెంటు సభ్యుడు బాబ్ బ్లాక్ మన్ బిబిసి తీరుపై మండిపడ్డారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అక్కడి హిందువులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. కానీ బిబిసి ఆ వేడుకను చూస్తూ కళ్ళల్లో నిప్పులు పోసుకుందని ఆరోపించారు. ” ఇది ఒక మసీదు విధ్వంసం జరిగిన ప్రదేశమని బీబీసీ తన కవరేజీలో చెప్పుకుంది.. అంటే మసీదు కంటే రెండు వేల సంవత్సరాలకు ముందు అక్కడ దేవాలయం ఉందన్న విషయాన్ని మర్చిపోయింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించారు.. ఈ విషయాన్ని బిబిసి ఎక్కడా చెప్పలేదు. వివాదాస్పద రామమందిరం అని పదేపదే ప్రకటించింది” అని బ్లాక్ మన్ మండిపడ్డారు. నిష్పక్షపాతంగా రిపోర్ట్ చేయడంలో విఫలమైన బిబిసి వైఫల్యం పై చర్చకు సమయం కేటాయించాలని బ్లాక్ మన్ ఇతర పార్లమెంటు సభ్యులను కోరారు.

బ్లాక్ మన్ వ్యాఖ్యల నేపథ్యంలో స్వదేశంలోనే బిబిసి వ్యతిరేక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో గతంలో కేంద్ర దాదాపు సంస్థల అధికారులు విచారణ చేసినప్పుడు బిబిసి తెగ గగ్గోలు పెట్టింది. నరేంద్ర మోడీపై డాక్యుమెంటరీ తీసినందుకు బహుమానం అంటూ వ్యాఖ్యానించింది. కానీ దర్యాప్తు సంస్థలు అసలు విషయాన్ని బయట పెట్టడంతో నాలుక కరుచుకుంది. రామ మందిర నిర్మాణం ఎక్కడ అనుకూలంగా మారుతుందోనని బీబీసీ కవరేజ్ విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శించిందని బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు. ఇందుకు బ్లాక్ మన్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తున్నారు. బ్లాక్ మన్ విమర్శలు చేసిన నేపథ్యంలో బిబిసి ఇంతవరకూ స్పందించలేదు.