Homeజాతీయ వార్తలుRythu Bharosa : సర్కార్ సంచలన నిర్ణయం.. 5 నుంచి రైతు భరోసా అప్లికేషన్లు.. డబ్బులు...

Rythu Bharosa : సర్కార్ సంచలన నిర్ణయం.. 5 నుంచి రైతు భరోసా అప్లికేషన్లు.. డబ్బులు ఎప్పుడిస్తారంటే ?

Rythu Bharosa : కాంగ్రెస్ సర్కార్ రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణాలను మాఫీ చేసింది. నాలుగు విడతలుగా దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటి రైతు భరోసా పథకం. ఈ పథకం కింద ఎకరానికి రూ.15 వేలు పంట పెట్టుబడి సహాయంగా జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం అమలు కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సహాయం కింద రైతు బంధు పేరుతో రూ.10 వేలు ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో అదే పథకాన్ని అమలు చేయడానికి రెడీగా ఉంది. సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు వివిధ సందర్భాల్లో రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం డబ్బులను సంక్రాంతి కానుకగా జమ చేస్తామని వెల్లడించారు. విధివిధానాలను రూపొందించడానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఒక క్యాబినెట్ సబ్-కమిటీ కూడా ఏర్పడింది.

ఈరోజు సచివాలయంలో క్యాబినెట్ సబ్-కమిటీ సమావేశం జరిగింది. ఈ సబ్-కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. రైతు భరోసా విధానాలపై నేటి సమావేశంలో కీలక చర్చ జరిగింది. రైతు భరోసాకు ఎంత కటాఫ్ ఉండాలి, సీలింగ్ ఎంత ఉండాలి, కౌలు రైతులకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలపై క్యాబినెట్ సబ్-కమిటీ చర్చించింది.

రైతు భరోసాపై నియమ నిబంధనల అమలుపై తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి దరఖాస్తులు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఎల్లుండి జరిగే కేబినెట్ మీటింగులో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జనవరి 14 నుంచి రైతు భరోసాను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలు, గుట్టలు, వెంచర్లకు రైతు బంధు సాయం అందిస్తోందని కాంగ్రెస్ నాయకులు పదే పదే ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే నిబంధనలను మార్చి అర్హులకు మాత్రమే ఇస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భరోసా సహాయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. నియమాలు ఎలా ఉంటాయి? ఎలాంటి మార్పులు ఉంటాయి? దీనిపై ఊహాగానాలు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఇది అందుబాటులో ఉండదనే చర్చ కూడా జరిగింది. ఈ ఊహాగానాలకు ఎల్లుండి తెరపడుతుంది. ఆదాయపు పన్ను చెల్లింపు ఉండకూడదని, భూమి పరిమితి ఉండకూడదని క్యాబినెట్ సబ్-కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version