CM KCR: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ క్రమంగా బలహీనపడుతోంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయి. వరుసగా ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనపై అన్నివర్గాల్లో వ్యతిరేత వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉచిత ఎరువులు, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, ఎస్టీలకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, దళిత ముఖ్యమంత్రి ఇలా చాలా హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. తాజాగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలోనూ అక్రమాలు జరుగుతున్నాయి. దీంతో గులాబీ పార్టీకి ఓటర్లు దూరమవుతున్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలను ఎదుర్కొనేందుకు సరికొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగాల భర్తీకి కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు. దళితబంధు లబ్ధిదారుల సంఖ్య పెంచారు. తాజాగా ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ వారం రోజుల్లో జీవో ఇస్తామని ప్రకటించారు.

వారం గడిచింది… జీవో ఏమైంది?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలకు ముందు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో పీకే టీంను నమ్ముకోవడం ఎంత నష్టమో .. జరిగిపోయిన తర్వాత తెలుసుకున్న కేసీఆర్.. ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఆయన వేసిన అడుగు కూడా అలాంటిదేనని అర్థం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్ల జీవో జారీ చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ పది రోజులైంది. జీవో జారీ కాలేదు. న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఒక్క సారి జీవో ఇస్తే రిజర్వేషన్ల తుట్టెను కదిలించినట్లేనని అది మొత్తానికే మోసం తెస్తుందన్న ఆందోళన పార్టీలో వ్యక్తం కావడంతో ఆగిందని గులాబీ నేతలే చెబుతున్నారు.
ఎస్టీ, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ ఒకే తీర్మానం..
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తాము అధికారంలోకి వస్తే ఎస్టీలు, ముస్లింలకు చెరో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్ఎస్ అధినతే కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి, గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో 2017లోనే తీర్మానం చేశారు. గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ ఒకే బిల్లును కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం మాత్రం అంగీకరించలేదు. అసలు ఆ తీర్మానాన్ని పట్టించుకోలేదు.
ఇప్పుడు ఎస్టీలకు మాత్రమే అని ప్రకటన..
హైదరాబాద్లో నిర్మించిన బంజారా, ఆదివాసీ భవన్లను కేసీఆర్ సెప్టెంబర్ 17న ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతామని ఈమేరకు వారం రోజుల్లో జీవో ఇస్తామని ప్రకటించి గిరిజనులు, ఆదివాసీలతో చప్పట్లు కొట్టించుకున్నారు. మరుసటి రోజు ఆదివాసీ నాయకులతో తన చిత్రపటానికి పాలాభిషేకం చేయించుకున్నారు. ఇప్పుడు ఓవైసీ ముస్లింల రిజర్వేషన్ల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లపైనా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏరç్పడింది. ఎందుకంటే మజ్లిస్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముస్లింల మద్దతు టీఆర్ఎస్కు ఎంతో బాగా ఉపయోగపడుతోంది. అయితే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారాయి. ముస్లింలకు రిజర్వేషన్ల జీవో ఇస్తే.. అది బీజేపీకి ప్రత్యక్షంగా అస్త్రం ఇచ్చినట్లే అవుతుంది.
రెండు వర్గాలకు రిజర్వేషన్లు పెంచితే..
కేసీఆర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎస్టీ, ముస్లింల కోసం వేర్వేరుగా జీవోలిస్తే ఇతర వర్గాల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొక తప్పదు. దీంతో చాలా సామాజికి వర్గాలు అధికార పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్నది ఇప్పుడు కేసీఆర్ ముందున్న అది పెద్ద సవాల్. ఇప్పుడు జీవో జారీ చేసి రిజర్వేషన్లను తెలంంగాణ సర్కార్ అమలు చేయవచ్చు. కేంద్రం అనుమతి అవసరం లేదు. కానీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఎవరైనా కోర్టుకు వెళ్తే రిజర్వేషన్లు ఆగిపోయే అవకాశం ఉంది. అలా ఆగిపోతే ప్రజల్లో ఆగ్రహం మరింత రెట్టింపవుతుంది. అందుకే కేసీఆర్ రిజర్వేషన్ల సమస్యను కదిలించి మరీ నెత్తి మీద పెట్టుకున్నారన్న అభిప్రాయం గులాబీ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది.