RBI Good News For Loan Borrowers: అంతర్జాతీయంగా పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. బయట ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సగటు మనిషి జీవితం దుర్భరంగా మారింది. ఇక అప్పులు తీసుకొని గృహాలు.. ఇతర కార్యకలాపాలు చేపట్టిన వారి పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానంలో వడ్డీరేట్లు పెంచుతుందని అందరు అనుకున్నారు. పైగా అంతర్జాతీయంగా పరిస్థితులు బాగా లేవు కాబట్టి వడ్డీ రేట్లు పెంచడం అనివార్యమని ఆర్థికవేత్తలు కూడా భావించారు.
అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. దేశీయంగా ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడిని గమనంలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీరేట్లు (5.25%) వద్ద కొనసాగిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్ర వెల్లడించారు. ద్రవ్య పరపతి విధానంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.. గ్లోబల్ క్రైసిస్.. నిత్యావసరాల ధరలు పెరగడం.. రూపాయి మీద ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరుగుతాయని నిపుణులు భావించారు.
కేంద్రీయ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా వ్యక్తిగత.. గృహ రుణాలు తీసుకున్న వారికి కాస్త ఊరట లభించింది. ఎందుకంటే వడ్డీరేట్లు పెరిగితే వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. ఇప్పటికే అన్ని ధరలు పెరిగాయి. గ్యాస్ నుంచి మొదలు పెడితే ఇంధనం వరకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనీ స్పెక్యులేషన్ అనేది తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు గనుక పెంచితే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. అందువల్లే వడ్డీరేట్లను పెంచలేదు.
కొంతకాలంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది.. ముఖ్యంగా ధరల స్థాయిని తగ్గించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. స్థిరమైన వృద్ధిని కొనసాగించాలంటే వడ్డీరేట్లు ఒకే విధానంలో ఉంచాలని రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావించింది. అందువల్లే కీలకమైన వడ్డీరేట్లను స్థిరంగా ఉంచుతోంది. ఇన్ని చేసినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో రూపాయి ధర పడిపోవడం వల్ల ఆర్థికపరమైన ఒత్తిడి పెరిగిపోతోంది.. రూపాయి విలువ పెరిగితేనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
