Rajasthan Child Marriage Rule: వెనుకటి కాలంలో వివాహాలు చిన్న వయసులోనే జరిగేవి. దానివల్ల అనేక రకాల అనర్ధాలు చోటు చేసుకునేవి. పైగా అప్పట్లో ఈ స్థాయిలో వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందలేదు కాబట్టి మరణాలు ఎక్కువగా సంభవించేవి. ఆ తర్వాత వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. వివాహాలకు ఒక నిర్దిష్టమైన వయసును ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మరణాలు తగ్గడం మొదలైంది. అంతేకాదు, మనుషుల్లో పరిపక్వత పెరిగింది.
ఈ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ.. అంతరిక్షంలో అద్భుతాలు చేసే స్థాయికి మనుషుల సామర్థ్యం పెరిగిపోయినప్పటికీ.. నేటి కాలంలో కూడా కొన్ని రకాల మూఢనమ్మకాలు.. దారుణాలు మన సమాజంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీనివల్ల రకరకాల అనర్ధాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి అనర్ధాలు సంభవించడానికి ప్రధాన కారణం బాల్య వివాహాలు. నేటికీ ఉత్తర భారత దేశంలోని రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్.. బీహార్ వంటి రాష్ట్రాలలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాల వల్ల అమ్మాయిల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నది. ముఖ్యంగా చిన్న వయసులోనే వారు గర్భం దాల్చడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి తోడు వారి శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.
బాల్య వివాహాలను అరికట్టడానికి ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.. వివాహ పత్రిక మీద వధూవరుల డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేస్తోంది. అంతేకాదు, వివాహ పత్రికలను సంబంధిత ఐసిడిఎస్ అధికారులకు పంపించాలని కండిషన్ కూడా విధించింది. దీంతో అక్కడ ఆ నిబంధన విజయవంతంగా అమలవుతోంది. ఫలితంగా బాల్య వివాహాలు జరగడం లేదు. గతంతో పోల్చి చూస్తే బాల్యవివాహాల సంఖ్య ఆ రాష్ట్రంలో చాలావరకు తగ్గిపోయింది. రాజస్థాన్ మాదిరిగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదేవిధంగా చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అధికారులు రాజస్థాన్ నమూనాను పరిశీలిస్తున్నారు. మరోవైపు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాల్య వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు.. ఉమ్మడి వరంగల్.. ఉమ్మడి మెదక్.. ఉమ్మడి నల్లగొండ.. ఉమ్మడి శ్రీకాకుళం.. ఉమ్మడి విజయనగరం.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలలో బాల్యవివాహాలు గతంలో విపరీతంగా జరిగేవి. ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఐసిడిఎస్ అధికారుల తనిఖీలలో ఇవి బయటపడుతున్నాయి. ఫిర్యాదులు వస్తే అధికారులు వెంటనే బాల్య వివాహాలు నిలిపివేస్తున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో పెళ్లి పత్రికల మీద వధూవరుల పుట్టిన తేదీలను నమోదు చేస్తున్న నేపథ్యంలో బాల్య వివాహాలు ఆగిపోయాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిబంధనను పరిశీలిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నిబంధన అమలయితే బాల్యవివాహాలకు చెక్ పెట్టొచ్చు. మరి ఆ దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
