https://oktelugu.com/

Kodandaram: ప్రొఫెసర్ కోదండరామ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్.. షాకిచ్చిన హైకోర్టు!

కేసు విచారణలో ఉండగానే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీరుల్లాఖాన్‌ పేర్లను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది.

Written By: , Updated On : January 30, 2024 / 05:49 PM IST
Kodandaram
Follow us on

Kodandaram: తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా నియామకమైన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీరుల్లాఖాన్‌ల ప్రమాణానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ప్రమాణ స్వీకారం చేయొద్దని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు ఇద్దరినీ గవర్నర్‌ తమిళిసౌ సౌందర రాజన్‌ నియమించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఈమేరకు శనివారం నోటిషికేషన్‌ కూడా వచ్చింది. సోమవారం ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా, మండలి చైర్మన్‌ గైర్హాజరుతో బ్రేక్‌ పడింది. తాను అనారోగ్యంగా ఉన్నానని, జనవరి 31న ప్రమాణం చేయిస్తానని సమాచారం ఇచ్చారు. దీంతో మండలికి వచ్చిన కోదండరామ్‌, అమీరుల్లాఖాన్‌ వెనుదిరిగారు.

కోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌ నేతలు
ఇదిలా ఉండగా గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా తమను గవర్నర్‌ తిరస్కరించడంపై బీఆర్‌ఎస్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. తమను 2023, జూలై 31న ప్రభుత్వం సిఫారసు చేసిందని, మూడు నెలలు పెండింగ్‌లో పెట్టిన గవర్నర్‌ చివరకు సెప్టెంబర్‌ 25న తిరస్కరించారని తెలిపారు. నిబంధనల మేరకు వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటించలేమని అప్పటి ప్రభుత్వానికి గవర్నర్‌ సమాచారం ఇచ్చారు.

విచారణలో ఉండగానే కొత్త ఎమ్మెల్సీలకు ఆమోదం..
కేసు విచారణలో ఉండగానే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీరుల్లాఖాన్‌ పేర్లను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. ఈ సిఫారసును గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. ఈ క్రమంలో తాజాగా శ్రవణ్‌, సత్యనారాయణ తమ కేసు తేలే వరకు కొత్త ఎమ్మెల్సీన ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని కోర్టును కోరారు. ఈమేరకు ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ప్రమాణం వాయిదా అందుకేనా..
ఇదిలా ఉంటే కొత్త ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం సోమవారం ఉండగా, మండలి చైర్మన్‌ వ్యూహాత్మకంగానే వాయిదా వేయించారని తెలుస్తోంది. మంగళవారం​శ్రవణ్‌, సత్యనారాయణ పిటిషన్‌పై విచారణ ఉండడంతో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అనారోగ్యం సాకుతో విచారణ వాయిదా వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం విచారణ జరిపిన కోర్టు ప్రమాణ స్వీకారానికి బ్రేక్‌ వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.