
ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటు జపం.. మునుపెన్నడూ, ఏ ప్రభుత్వమూ చేయలేదు. చివరకు గతంలోని బీజేపీ సర్కారు కూడా ఇలాంటి దూకుడు చర్యలకు పాల్పడలేదు. కానీ.. మోడీ ప్రభుత్వం అత్యంత వేగంగా ప్రైవేటీకరణ మంత్రం జపిస్తూ.. దాన్ని బాహాటంగా ప్రకటించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఏ ప్రభుత్వమైనా ప్రజల ఉపాధికి, ఉద్యోగ భద్రతకు హామీ ఇస్తుంది. కానీ.. ప్రభుత్వం రంగంలోని ఫ్యాక్టరీలను, సంస్థలను ప్రైవేటు పరం చేయడమేకాకుండా.. ప్రైవేటీకరణతోనే దేశం అభివృద్ధి చెందుతుందని సాక్షాత్తూ ప్రధాన మంత్రే ప్రకటించారు. దీంతో.. దీని వెనకున్న అసలు కారణాలు ఏంటనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది.
Also Read: కమల్ థర్డ్ ఫ్రంట్.. సీఎం అభ్యర్థి ఆయనే..
రిజర్వేషన్ల ఎత్తివేతకేనా..?
దేశంలో శతాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక అనగారిణ వర్గాలన్నీ దరిద్రంలోనే మగ్గుతున్నాయి. కులాల వారీగా విడిపోయిన ఈ దేశంలో అభివృద్ధి విభజన రేఖలు కూడా అలాగే ఉన్నాయి. వీటిని రూపుమాపి, దేశంలోని నిమగ్న వర్గాలకు ఉన్నత వర్గాలతో సమానంగా అవకాశాలు పొందేందుకు, తద్వారా ఆత్మగౌరవంతో బతికేందుకు రాజ్యాంగం తీసుకొచ్చిందే రిజర్వేషన్. విద్య, ఉపాధి రంగాలతోపాటు, ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాల్లోనూ ఈ రిజర్వేషన్ కల్పించింది. అయితే.. ఈ రిజర్వేషన్ పై కొంతకాలంగా.. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తీవ్ర చర్చ మొదలైంది. సాక్షాత్తూ బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పలుమార్లు రిజర్వేషన్లపై మాట్లాడారు. వీటిని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: ఇండియాలో సెకండ్ వేవ్ మొదలైందా..? కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
ఇప్పుడు జరుగుతున్నది అదేనా..?
రిజర్వేషన్లు ఎత్తేస్తున్నామని ప్రభుత్వం నేరుగా నిర్ణయం తీసుకుంటే.. ప్రజాగ్రహాన్ని చవిచూడడం తథ్యం. అందుకే.. పరోక్షంగా రిజర్వేషన్లపై వేటు వేస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దేశంలోని మేధావులు ఇదే మాట చెబుతున్నారు. ఇప్పుడు.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తున్న మేథావులంతా.. ఇది రిజర్వేషన్లపై దాడిగా చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తే.. ప్రస్తుతం అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే.. ప్రభుత్వ రంగంలోని సంస్థలను ప్రైవేటుకు అమ్మేస్తున్నారని వామపక్ష, ఇతర ప్రజాసంఘాల నేతలు, మేధావులు విమర్శిస్తున్నారు.
ఉద్దేశపూర్వక దాడిః దళిత సంఘాలు
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రిజర్వేషన్లు తీసేందుకు కుట్ర చేస్తోందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాక్షాత్తూ.. యూపీకి చెందిన ఓ బీజేపీ ఎంపీ కూడా రిజర్వేషన్లు తీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించి పార్టీ నుంచి వెళ్లిపోవడం గమనార్హం. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు కూడా జరిగాయి. అయితే.. రిజర్వేషన్లు తీసేసే ప్రశ్నే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటివారు ప్రకటించారు. అయితే.. ఇదంతా మభ్యపెట్టడమేనని దళితులు వాదిస్తున్నారు. రిజర్వేషన్లు నేరుగా తీసేయకుండా.. రిజర్వేషన్లు కల్పించాల్సిన ప్రభుత్వ సంస్థలను మాత్రం తీసేస్తున్నారని అంటున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
ప్రధాని మాటలే…
రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలోనే అమలు చేస్తారన్న విషయం తెలిసిందే. మరి, ప్రభుత్వరంగ సంస్థలేవీ ఇక ఉండవని నేరుగా ప్రధాని మోడీనే చెబుతున్నప్పుడు… రిజర్వేషన్ ఫలాలు అందుకునే అవకాశం ఎలా ఉంటుందని దళిత నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ అంతంత మాత్రంగా ప్రభుత్వ సర్వీసుల్లో ఇప్పుడు అరకొర అవకాశాలు మాత్రమే లభిస్తున్నాయి. ఇప్పుడు వాటిని కూడా లాగేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.