2017 ఎన్నికల్లో మొత్తం 117 సీట్లకు 70 సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ పంజాబ్ లో తిరుగులేని పార్టీగా అవతరించింది. దీంతో ముఖ్యమంత్రిగా పాటియాలా రాజవంశీకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ అయ్యారు. కానీ అమృత్ సర్ ఎమ్మెల్యే నవజ్యోతి సింగ్ రూపంలో ఆయనకు చుక్కెదురవుతోంది. సిద్దూ ప్రస్తుతం పీసీసీ పదవి కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రియాంక గాందీ మద్దతు పొందినట్లు ప్రచారం సాగుతోంది. అయితే అమరీందర్ మాత్రం సిద్దూకు పదవి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.
అమరీందర్, హైకమాండ్ మధ్య కేంద్ర బిందువుగా ప్రశాంత్ కిషోర్ నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే సూచనలతోనే అధికారం చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు పీకే కాంగ్రెస్ కు అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారట. అసలు కాంగ్రెస్ మద్దతు లేకుండానే స్టాలిన్ అధికారం చేపడతారని సూచించినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీకి పీకే అంటేనే పీకల్లోతు కోపం. ఈ నేపథ్యంలో మూడో కూటమి ఏర్పాటుకు పీకే అవసరం కావడంతో ఇప్పుడు ఏమేరకు పీకేను నమ్ముతారో వేచి చూడాల్సిందే.
ప్రశాంత్ కిషోర్ తో అమరీందర్ టచ్ లోనే ఉంటున్నారు. తరచూ వీరి మధ్య భేటీలు కొనసాగుతున్నాయి. ఆయన సలహాలు, సూచనలు అమరీందర్ తూచ తప్పకుండా పాటిస్తున్నారు. అయినప్పటికీ రాష్ర్టంలో కరెంటు కొరత, మాదక ద్రవ్యాల వ్యాపారం, అంతర్గత కలహాలు వంటి సమస్యలు తీరడం లేదు. దీంతో పంజాబ్ లో అమరీందర్ సైతం ఏ మేరకు గట్టెక్కుతారో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.