ఏపీలో ఇప్పుడు పవన్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎలాగైనా పవన్ ను బీజేపీకి దూరం చేసి తమతో కలుపుకోవాలని టీడీపీ, చంద్రబాబు కాచుకు కూర్చున్నాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీకి మద్దతుగా పవన్ నిలిచాడు. అమరావతి రైతులకు న్యాయం కోసం అంటూ కేంద్ర బీజేపీ పెద్దల వరకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో పొత్తు ప్రకటన చేశారు. తరువాత ఏపీ విషయంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు పవన్ కళ్యాణ్ ను కోలుకోలేని దెబ్బతీసిందని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు. ఆ ప్రాబల్యం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో కనిపించింది. విశాఖస్టీల్, రైల్వేజోన్ ఇలా ప్రతీచోట ప్రతీకూల వాతావరణం ఎదురుకావడంతో ఇక లాభం లేదని డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని ఉప్పందుకున్న టీడీపీ ఆయన్ను తమవైపు లాగడానికి ప్రయత్నాలు చేస్తోంది.
బీజేపీలో గౌరవం లేదని వారికి తెలిసిరావాలంటే.. టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణిదేవిని గెలిపించాలంటూ.. పోలింగ్ కు ముందు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. దాంతో అవాక్కయిన టీ బీజేపీ నేతలు.. వివరణలు ఇచ్చుకున్నా… జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అసలే తిరుపతి లోకస్ సభ స్థానానికి ఉప ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఇరకాటంలో పడిన కమలం.. ఎలాగోలా ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో సక్సెస్ అయ్యింది. ఈలోగా జనసేన శ్రేణులు అధినేత మనసులో ఉద్దేశం గ్రహించి మింగుడు పడని వ్యాఖ్యలతో రాజకీయాన్ని మరింత వేడెక్కించారు.
తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన ఓట్లు బీజేపీకి బదిలీకాకపోతే.. ఘోర పరాజయం తప్పదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా ‘పవన్ కళ్యాణ్’ కూటమి తరుఫున సీఎం అని ప్రకటించారు.. పవన్ కళ్యాణ్ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా.. బీజేపీ శ్రేణులు నడుచుకోవాలని సోము పార్టీ సమావేశంలో ఆదేశించారు. అంతే కాదు.. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రధాని మోడీ చెప్పారని వివరించారు.
ఏపీలో వపన్ కల్యాణ్ ను ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టాలంటూ అధిష్టానం చెప్పిందని.. ప్రధాని మోదీకి సైతం పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమంటూ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. బీజేపీలో పవన్ కళ్యాణ్ కు అమిత గౌరవం ఇస్తున్నారు. ప్రసన్నం చేసుకోవడంతో పాటు.. ఆయన కమలాన్ని కాదని. సైకిల్ పార్టీ కాజేయకుండా బీజేపీ ఈ గట్టి ప్రతిపాదన చేసిందని చెప్పొచ్చు. దీంతో చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఖచ్చితంగా పవన్ అటువైపు పోకుండా బీజేపీ .. పవన్ ముందరికాళ్లకు బంధం వేసినట్టైంది.